వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి రోజు రోజుకు పెరిగిపోతోంది. జగన్ పైనే ఒత్తిడి తేగల నేతలు ఎవరున్నారబ్బా అని అనుకుంటున్నారా ? అవును ఉన్నారు లేండి. అయితే వాళ్ళు వైసిపి నేతలు కాదు. పార్టీలో చేరకుండానే జగన్ పై బయటనుండే ఇద్దరు నేతలు ఒత్తిడి తెస్తుండటమే విచిత్రంగా ఉంది. దాంతో ఇద్దరు నేతల మధ్య జగన్ నలిగిపోతున్నట్లు సమాచారం.
క్లీన్ స్వీప్ కు జగన్ ప్లాన్
ఇంతకీ విషయం ఏమిటంటే, రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్ధానం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైసిపి ఏకంగా ఏడు నియోజకవర్గాల్లో జెండా ఎగురవేసింది. వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లను గెలుచుకోవాలని జగన్ గట్టిగా ప్లాన్ వేస్తున్నారు. ఇటువంటి సమయంలోనే హటాత్తుగా పెద్ద సమస్య ముంచుకువచ్చింది. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లోకి వెంకటగిరి నియోజకవర్గం చాలా కీలకమైనదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇపుడా నియోజకవర్గమే జగన్ ను టెన్షన్లోకి నెట్టేస్తోంది.
అడ్డు చెప్పని వైసిపి నేతలు
టిడిపిలో ఇమడలేక చాలాకాలంగా వైసిపిలో చేరాలని జిల్లాలో ఆనం బ్రదర్స్ గా పాపులరైన ఆనం సోదరులు వెయిట్ చేస్తున్నారు. అయితే, సోదరుల చేరికను వైసిపిలోని ఎంపి, ఎంఎల్ఏలు అడ్డుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి ఇద్దరికీ నియోజకవర్గాలను సర్దుబాటు చేయటం కష్టమన్న భావనతో జగన్ కూడా ప్రజా ప్రతినిధుల వైపే మొగ్గు చూపారు. దాంతో ఆనం సోదరులు వైసిపిలో చేరిక ఆగిపోయింది. అయితే అనారోగ్యం కారణంతో ఈమధ్యే ఆనం వివేకానందరెడ్డి మరణించారు. దాంతో వైసిపి నేతలకు సగం ఇబ్బందులు తొలగిపోయాయి. దాంతో ఆనం రామనారాయణ రెడ్డి ప్రయత్నాలను ఈసారి ఎవరూ అడ్డు చెప్పలేదు.
వెంకటగిరిపై మొగ్గు చూపుతున్న ఆనం
ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనే సమస్య వచ్చినపుడు సొంత నియోజకవర్గమైన ఆత్మకూరును వదులుకోవటానికి ఆనం సిద్ధపడ్డారు. రెండో ఆప్షన్ గా వెంకటగిరి నియోజకవర్గంలో పోటీ చేయటానికి సిద్దపడ్డారు. అయితే ఇంకా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనుకోండి. ఇంతలో హటాత్తుగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జగన్ ను కలిసారు. పిఠాపురంలో పాదయాత్రలో ఉన్న జగన్ తో నేదురుమల్లి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అడిగారు. దాంతో జగన్ కు సమస్య మొదలైంది.
జగన్ తో భేటీ అయిన నేదురుమల్లి
ఎందుకంటే, రామ్ కుమార్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కొడుకన్న విషయం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో జనార్ధన రెడ్డి దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగారు. మాజీ ముఖ్యమంత్రిది వెంకటగిరి నియోజకవర్గమే. కాబట్టి ఆయన కుంటుంబమంతా దశాబ్దాలుగా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకునుంది. అందులోనూ రామ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బిజెపిలో రాష్ట్ర కార్యదర్శి. విషయం ఏమిటంటే అటు ఆనం, ఇటు నేదురుమల్లి కుటుంబాలకు వెంకటగిరిలో మంచి పట్టే ఉంది. విచిత్రమేమిటంటే ఇద్దరూ ప్రస్తుతం వైసిపిలో లేరు. టిక్కెట్టు ఖాయమైతేనే పార్టీలో చేరుతారట. దాంతో ఇద్దరిలో ఎవరికి టికెట్టు ఇవ్వాలో తేల్చుకోలేక జగన్ నలిగిపోతున్నారు.