భారత్ స్వాతంత్రం అయితే సాధించింది. మరి తర్వాత ప్రపంచ దేశాతో పోటీ పడాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి విధానాలను అవలంభించాలి...? ఎలాంటి ప్రణాళికలను రచించాలి...? సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొనాలి...? అన్ని రంగాల్లో అభివృద్ధిని ఏ విధంగా సాధించాలి...? పరదేశాల నుండి ఏ విధంగా రక్షణ పొందాలి...? ఇలా ఎన్ని సవాళ్లు, ప్రతి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డ భారత్ ఉద్యమ నాయకులనే దేశ రథసారథులుగా ఎన్నుకొంది. ఎన్నో ప్రణాళికలను రచించుకొంది. మంచి నాయకులతో సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలను కనిపెట్టి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గల దేశంగా అవతరించింది.
బ్రిటీష్ కబంధ హస్తాల నుండి విముక్తి పొంది భారత్ స్వేచ్చా వాయువులు పీల్చుకొని నేటితో 7 దశాబ్ధాలు ముగిసిన సందర్భంగా ఒక్క సారి అప్పటి నుంచి ఇప్పటివరకు మనం ఎదుర్కొన్న సవాళ్లను, మనం పొందిన విజయాలను ఒక్క సారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరదేశీ పాలానలో బందీ అయిన భరత ఖండాన్ని తమ స్థితిగతులు, పరిస్థితులు మారాలంటే స్వాతంత్రాన్ని సాధించాలని పిలుపునిచ్చి అలుపెరుగని పోరాటాలు చేసి బ్రీటీష్ తూటాలను సైతం లెక్కచేయకుండా ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన ఎందరో మహనీయులకు వందనం.. అభివందనం...!!
పేదరికం, నిరుద్యోగం, ఆర్ధిక అసమానత, నిరక్ష్యరాస్యత, సాంకేతిక లోపం, మహిళల అక్ష్యరాస్యత, శిశుమరణాలు లాంటి అనేక సమస్యలను పరిష్కరించడంలో భారత్ విఫలం అవుతోంది. దీనికి కారణాలు అనేకం, ప్రభుత్వ నిర్లక్ష్యం తో పాటు రాజకీయ నాయకుల్లో ప్రజా సమస్యల పట్ల స్పందించే తత్వం కరువవ్వడం...? వారిని, ప్రస్తుత విధానాలను సైతం ప్రశ్నించేవాడు కరువవ్వడం, ప్రజల్లో అలసత్వం వీటికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏం చేయాలి...? మన రాజకీయాల్లో మార్పులురావాలి. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే నాయకులు భారత్ కు చాలా వసరం. దీనితో పాటు ప్రజల్లో కష్టించి పనిచేసే మనస్తత్వం పెరగాలి. సామాన్యుల సమస్యలకు వెంటనే స్పందించి మేమున్నాం.. మీ వెంట అని భరోసా కల్పించే నాయకులు ఉన్నప్పుడే భారత్ అభివృద్ధి సాధ్యం...!!