సాధారణ ఎన్నికలకు ముందే అటు అధికార బీజేపీ, ఇటు బీజేపీ వ్యతిరేక కూటమికి మరో కీలక పరీక్ష ఎదురవుతోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక రూపంలో ఈ పరీక్ష ఎదురవుతోంది. ఎలాగైనా డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని బీజేపీ, ఈ అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కమలదళానికి ఇవ్వొద్దన్న పట్టుదలతో కాంగ్రెస్, తదితర విపక్షాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వచ్చే లోక్సభ ఎన్నికలపై పడుతుందని ఇరువర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో 122మంది సభ్యుల మద్దతు ఉంటేనే డిప్యూటీ చైర్మన్ పదవి దక్కుతుంది.
ఈ మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడానికి బీజేపీ ఏం చేస్తుందన్నది అందరిలో ఆసక్తినిరేపుతోంది. మరోవైపు సరైన బలం లేదు కాబట్టి పోటీకి దూరంగా ఉన్నా ఆశ్చర్యమేమీ లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో చాలా రోజులుగా హడావుడి జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నగారా మోగడంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. వర్షాకాల సమావేశాల్లోపే రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ను నియమించాలని చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయించారు.
ఈమేరకు ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ నామినేషన్లకు గడువు ఉంది. పీజే కురియన్ పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికను నిర్వహిస్తున్నారు. అయితే ఖాళీ అయిన డిప్యూటీ చైర్మన్ స్థానాన్ని పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అయితే, ఇటీవల కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఓటింగ్కు టీఆర్ఎస్, బీజేడీలు దూరంగా ఉన్నాయి.
అయితే ఈ ఎన్నికల్లో అటు బీజేపీకి, ఇటు విపక్ష కూటమికి తటస్థంగా ఉన్న టీఆర్ఎస్, బీజేడీ, వైసీపీల నిర్ణయం కీలకం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, నవీన్పట్నాయక్, జగన్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది ఇప్పుడు ఇరు కూటముల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారు..? కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయంలో ఇప్పటికైతే క్లారిటీ లేదు. అయితే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విపక్ష కూటమి తరుపున త`ణమూల్ అభ్యర్థిని బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా..? లేదా అన్నది చూడాలి.