కొత్త తరహా రాజకీయాలకు తెరదీస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే అంతా నిజమే అనుకున్నారు. మరీ అంత కొత్త తరహాగా ఉంటుందని మాత్రం ఎవరూ అనుకోలేదు. ఇప్పటి వరకూ పార్టీలోని నేతలకు ఏ పార్టీ అధినేతైనా పదవులు కట్టబెట్టేవారు. కానీ పవన్ మాత్రం పార్టీలో లేని వారికి, చేరుతారో లేదో తెలీని వారికి కూడా పదవులను కట్టబెట్టేస్తున్నారు. దాంతో పవన్ చెప్పిన కొత్త తరహా రాజకీయం నవ్వులపాలవుతోంది.
ఎవ్వరూ పార్టీలో చేరలేదు
పవన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పర్యటనలో ఉన్న పవన్, మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణతో భేటీ అయ్యారు. భేటీ తర్వాత పవన్ మాట్లాడుతూ, ముత్తాకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో స్ధానం ఇస్తున్నట్లు ప్రకటించారు. విచిత్రమేమిటంటే ముత్తా ఇంకా జనసేనలో చేరనే లేదు. పవన్ ప్రకటన చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. పార్టీలో ఇంకా చేరకుండానే అప్పుడే పదవా ? అంటూ ముక్కన వేలేసుకున్నారు.
నిజంగానే కొత్త తరహా
అలాగే, ఆమధ్య తూర్పు గోదావరి జిల్లా కో ఆర్డినేటర్ గా మేడా గురుదత్త ప్రసాద్ ను నియమించారు. జాయింట్ కో ఆర్డినేటర్లుగా పెసంగి ఆదినారాయణ, శెట్టిబత్తుల రాజబాబులను ప్రకటించారు. విషయం ఏమిటంటే ఇద్దరు కూడా జనసేనలో సభ్యులు కారు. పదవి ప్రకటించినపుడు శెట్టిబత్తుల వైసిపిలో ఉన్నారు. ఇక, పెసింగి ఆదినారాయణ పదవీ విరమణ చేసిన సిబిఐ జెడి లక్ష్మీనారాయణ పర్యటనల్లో బిజిగా ఉన్నారు. పవన్ చెప్పిన కొత్త తరహా రాజకీయమంటే ఇదేనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.