చూడబోతే పరిస్దితులు అలాగే కనబడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అనంతపురం అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల నుండి పోటీ చేయటానికి వైసిపి తరపున గట్టి అభ్యర్ధులు లేరంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తరచూ ఈ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మారుస్తుండటమే ప్రధాన కారణంగా చెప్పాలి. పార్టీ పరిస్దితులు సక్రమంగా లేనపుడు కూడా జగన్ ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారో ఎవరికీ అర్దం కావటం లేదు.
ఇన్చార్జిగా మార్పులు
అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మొదట బి. గుర్నాధరెడ్డి ఇన్చార్జిగా ఉండేవారు. ఆయన టిడిపిలోకి వెళ్ళిపోవటంతో ఇన్చార్జిగా మైనారిటీ నేత నదీంను నియమించారు. చిన్న చిన్న లోపాలున్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో నదీం చురుగ్గా ఉన్నారనే చెప్పాలి. పైగా నియోజకవర్గంలోని ఓట్లలో మైనారిటీలు సుమారుగా 50 వేల వరకూ ఉన్నారు. కానీ హటాత్తుగా నదీంను పక్కన పెట్టేసి మాజీ ఎంపి అనంత వెంకట్రామరెడ్డిని నియమించారు.
ముందు నదీం..ఇపుడు అనంత..తర్వాతెవరో ?
విచిత్రమేమిటంటే నదీంను ఎందుకు తీసేశారో, అనంతను ఎందుకు నియమించారో జగన్ కే తెలియాలి. పైగా నదీంను హిందుపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారు. అదే సమయంలో అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి మున్సిపల్ కమీషనర్ గా ఉద్యోగ విరమణ చేసిన రంగయ్యను నియమించారు. రెండు సార్లు ఎంపిగా చేసిన అనంత వెంకట్రామరెడ్డిని మళ్ళీ ఎంపిగానే పోటీ చేయించాలని పార్టీ నేతలు జగన్ కు చెప్పారట. అదే సమయంలో నదీంనే అసెంబ్లీకి పోటీ చేయించి రంగయ్యను హిందుపురం లోక్ సభకు పోటీ చేయిస్తే బాగుంటుందని కూడా పలువురు నేతలు సూచిస్తున్నారట.
ప్రయోగాలతో బలహీన పడిందా ?
వివిధ కారణాల వల్ల టిడిపిపై జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చేసింది. ఈ నేపధ్యంలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధులను గనుక జగన్ జాగ్రత్తగా ఎంపిక చేస్తే జిల్లాలోని 14 సీట్లలో మెజారిటీ సీట్లు వైసిపి వచ్చే అవకాశాలున్నాయి. పోయిన ఎన్నికల్లో వైసిపికి వచ్చింది 2 స్ధానాలు మాత్రమే. కొన్ని సీట్లలో ప్రయోగాలు చేస్తూ వైసిపి బలహీనంగా కనబడుతుంటే, ప్రజా వ్యతిరేకత వల్ల టిడిపి కూడా ఇబ్బందుల్లోనే ఉంది.
జెసి చెప్పింది నిజమేనా ?
ప్రస్తుత పరిస్ధితులను చూస్తే టిడిపి దాదాపు 12 నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సిట్టింగులను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో టిడిపి 10 సీట్లలో ఓడిపోతుందని అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డే బహిరంగంగా చేసిన ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది. జెసి చెప్పింది నూరు శాతం కరెక్టే అనటంలో సందేహం లేదు. జనాల్లో టిడిపి ఇమేజి గురించి స్వయంగా టిడిపి ఎంపినే అంత మాట చెప్పిన తర్వాత దాన్ని వైసిపి అవకాశంగా తీసుకోకపోతే
స్వయంకృతం తప్ప ఇంకోటి కాదు.