వైసీపీ బీజేపీ తో కుమ్మక్కయిందని ప్రచారం చేసి లబ్థి పొందాలని టీడీపీ ఇప్పటివరకు ప్రయత్నించింది. కానీ ఆ ప్లాన్ పెద్దగా పని చేయలేదు అలాగే రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ విషయం లో వైసీపీ తీసుకున్న స్టాండ్ టీడీపీ కి మింగుడు పడటం లేదు. ప్రత్యేకహోదా ఇవ్వకుండా రాష్ర్టానికి తీరని అన్యాయం చేసిన ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఓటు వేస్తామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మంగళవారం మరోసారి స్పష్టంచేశారు. వైసీపీ నిర్ణయం టీడీపీ ఆశలకు గండికొట్టినట్టైంది.
బీజేపీకి వైసీపీ వ్యతిరేకంగా వెళ్లాలనుకోవడం తెలుగుదేశానికి ఏమాత్రం రుచించడంలేదు. టీడీపీ విజయావకాశాలు వైసీపీ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకొని అధికారాన్ని దక్కించుకొన్నాయి. వీరికి జనసేన అధినేత పవన్ మద్దతు అదనపు బలమైంది. విభజిత రాష్ర్టానికి పదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని మోడీ అంటే, కాదు కాదు 15ఏళ్లు అని చంద్రబాబు ఒకరికి మించి మరొకరు హామీలు, డిమాండ్లు చేశారు.
నాలుగేళ్లపాటు కేంద్రంలోనూ, రాష్ర్టంలోనూ అధికారాన్ని పంచుకున్న బీజేపీ, టీడీపీ నేతలు ప్రత్యేకహోదా డిమాండ్ను గాలికొదిలేశారు. అంతేకాదు ఆమాట మాట్లాడిన కొందరిని జైల్లో కూడా పెట్టారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, వామపక్షాల నేతలు మాత్రం అవిశ్రాంతంగా ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్లపాటు పోరాడుతూనే ఉన్నారు. తమ ఆకాంక్షను తుంగలో తొక్కిన టీడీపీ, బీజేపీ నేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను గుర్తించిన సీఎం చంద్రబాబు నెపాన్ని కేంద్రంపై మోపి తాను తప్పించుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా కేంద్రం నుంచి ఇటీవల వైదొలిగారు.