చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ప్రజల మనోభావాలు పట్టవా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి విజయవాడను ఇన్ని వివాదాలు చుట్టు ముడుతున్నా చంద్రబాబులో కనీసమాత్రంగా కూడా స్పందన కనబడటం లేదు. వివాదాల్లో టిడిపి నేతలు లేకపోతే సామాజికవర్గం ఇన్వాల్వ్ మెంటు ఉండటమే చర్యలు తీసుకోలేకపోవటానికి ప్రధాన కారణమా ?
వివాదాలు ఈ స్ధాయిలో లేవు
గతంలో కూడా విజయవాడ చుట్టూ ఏదో ఒక వివాదం ఉండేదే అనటంలో సందేహం లేదు. కానీ గడచిన నాలుగేళ్ళల్లో ముసురుకున్న ఈ స్ధాయి వివాదాలు గతంలో లేవనే చెప్పాలి. విజయవాడ చుట్టూ గతంలో వివాదాలు ముసురుకోవటం వేరు ఇపుడు వేరన్న విషయాన్ని పాలకులు గుర్తించినట్లు లేదు. గతంలో వివాదాలు చుట్టుముట్టినా అపుడు అనేక నగరాల్లో విజయవాడ ఒకటి మాత్రమే. కానీ ఇపుడలా కాదు. ఏకంగా రాజధాని ప్రాంతంగా మారిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి నివాసముంటున్న ప్రాంతంలోనే ఇన్ని వివాదాలు రేగుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.
పెరిగిపోయిన క్రైం రేటు
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే విజయవాడ రాజధాని ప్రాంతమైంది. అప్పటి నుండి క్రైం రేటు ఎక్కువైపోయింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనంత క్రైం ఒక్కసారిగా పెరిగిపోయింది. మహిళలపై అఘాయిత్యాలు, డబ్బుల కోసం కిడ్నాపులు, హత్యలు, జూదగృహాల నిర్వహణ...ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. మిగిలిన క్రైం రేటు ఎలాగున్నా కాల్ మనీ సెక్స్ రాకెట్, ప్రైవేటు స్ధలాలను పోర్జరీలు చేసి సొంతం చేసుకోవటం లాంటి భారీ నేరాలతో విజయవాడ రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తోంది.
సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్
గడచిన నాలుగేళ్ళుగా విజయవాడ కేంద్రంగా ఇంత విచ్చలవిడిగా నేరాలు పెరిగిపోవటానికి కారణాలేంటి ? అంటే చంద్రబాబు చేతకాని తనమే అని చెప్పక తప్పదు . ఎలాగంటే వెలుగు చూస్తున్న నేరాల్లో అత్యధిక నేరాల వెనుక టిడిపి నేతల హస్తముందనే ఆరోపణలున్నాయి. కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఎంఎల్ఏలు, ఎంఎల్సీల సోదరులు, మంత్రుల మద్దతుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్లే సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసులో ఎవ్వరిపైనా ఇంత వరకూ పెద్దగా చర్యలు లేవు. ఇక స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చిన అనేక స్ధలాలను ఎంఎల్ఏ బోండా ఉమా తదితరులు సొంతం చేసుకుంటున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
టిడిపి నేతల పైనే ఆరోపణలు
అదే విధంగా డబ్బుల కోసం జరుగుతున్న కిడ్నపుల వెనుక కూడా టిడిపి నేతల హస్తమే ఉందనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఇక, తాజాగా దుర్గగుడిలో అమ్మవారికి భక్తులిచ్చిన పట్టుచీరను ఏకంగా ధర్మకర్తల మండలి సభ్యురాలు కోడెల సూర్యలత దొంగతనం చేయటం ఆశ్చర్యంగా ఉంది. దొంగతనాలు చేస్తున్నవారిని, నేరాల వెనుక ఉన్నవారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదంటే రెండే కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి టిడిపి నేతలవ్వటమో లేకపోతే మద్దతుండటమో. ఇక, రెండోది తమ సామాజికవర్గం వారవ్వటమే. అందుకనే ప్రభుత్వంలో విచ్చలవిడితనం పెరిగిపోవటంతోనే విజయవాడ ప్రాంతం ఇన్ని వివాదాలకు కేంద్రబింధువై పోయింది.