వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా విపక్షాలు పక్కా ప్రణాళితో ముందుకు వెళ్తున్నాయి. ఇందులో ప్రధానంగా మోడీ పరాజయమే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందుకు వేదికగా అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ వేదికగా మారుతోంది. 80 లోక్సభ స్థానాలు ఉన్నయూపీలో గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 73స్థానాలు గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కట్టడి చేస్తే.. బీజేపీ ఓటమి ఖాయమనే అంచనాల్లో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్ ఎల్డీలు ఉన్నాయి. ఈ దిశగా మహాకూటమి ఏర్పాటు దిశగా చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే, అనూహ్యంగా ఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ కీలక ప్రకటన చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో సంబంధం లేకుండా.. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ ఎల్డీలు మాత్రమే కలిసి పోటీ చేస్తాయని ఆయన ప్రకటించారు. మొత్తంగా కాంగ్రెస్ కూటమి నుంచి తప్పుకుంటున్నామని చెబుతూనే తమకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఎప్పటికీ మంచి మిత్రుడేనంటూ ప్రకటించారు. అయితే, పైకి కాంగ్రెస్ పార్టీ కి పెద్ద దెబ్బగానే కనిపిస్తున్నా.. అఖిలేశ్ పక్కా వ్యూహంతో ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లుగా కన్పిస్తున్నా.. లోలోపల మాత్రం ఏదో మతలబు ఉందనే టాక్ వినిపిస్తోంది.
నిజానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచే విషయంలో బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయవతి వెనకడుగు వేసిన విషయం తెలిసింది. అంతేగాకుండా.. ‘ప్రాంతీయ పార్టీలుగా మాకు పట్టు ఉంది... జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ విషయం వేరు... అంటూ అఖిలేశ్ ప్రకటించడం గమానర్హం. ఒక్కసారి ఉత్తప్రదేశ్లోని పలు పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలను గమనిస్తే చాలు విపక్షాల వ్యూహం అర్థమవుతుంది. గోరఖ్పూర్, పుల్పూర్, కైరానా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ ఎల్డీలు,కాంగ్రెస్ లు కలిసి వ్యూహాత్మకంగా బీజేపీ కంచు కోటల్ని బద్దలు కొట్టాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్తో ఎక్కడ పొత్తు పెట్టుపెట్టుకోవాలో అక్కడే కలిసి నడిచాయి ఎస్పీ, బీఎస్పీలు. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిస్తే నష్టం జరుగుతుందని భావించిన చోట పక్కకు పెట్టేశాయి.
ఈ ఫార్ములాతోనే బీజేపీకి విపక్షాలు మట్టికరిపించాయి. బీజేపీని మట్టి కరిపించాలంటే.. ఇదే ఫార్ములాను వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా అమలు చేయాలని అఖిలేశ్ భావిస్తున్నట్లు పలువురు విశ్లేషకులు అంటున్నారు. అయితే, అంతిమంగా తమ ఉమ్మడి ప్రత్యర్థి అయిన బీజేపీని ఓడించడమే లక్ష్యమని ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీలు అంతర్గతంగా ఓ అవగాహన వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఫార్మలాతోనే మోడీ కూడా ఓడించొచ్చునన్న అంచనాల్లో ఆ పార్టీలు ఉన్నాయి. ఈ వ్యూహం ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.