భారతీయ జనతా పార్టీ కార్యదర్శి నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డిపై చర్యలకు పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రంగం సిద్దం చేశారు. పార్టీ కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలంటూ నేదురుమల్లికి అధ్యక్షుడు నోటీసు జారీ చేశారు. అయితే, నోటీసుకు సమాధానం చెప్పటానికి రామ్ కుమార్ రెడ్డి నిరాకరించారు. దాంతో నేదురుమల్లిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది.
వైసిపిలోకి రామ్ కుమార్
ఇదిలావుంటే తాను త్వరలో వైసిపిలో చేరనున్నట్లు నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కొడుకైన రామ్ కుమార్ రెడ్డి తన మద్దతుదారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మద్దతుదారులతో మాట్లాడుతూ త్వరలో వైసిపిలో చేరనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో మాట్లాడిన మద్దతుదారులు కూడా భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా రామ్ కుమార్ రెడ్డి వైసిపి లోనే చేరాలని సూచించారు. ఒకటి రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాలని రామ్ కుమార్ నిర్ణయించారు.
వెంకటగిరి మీదే కన్ను
నెల్లూరు జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో నేదురుమల్లి కుటుంబం కూడా ఒకటన్న విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి వారసుని హోదాలో రామ్ కుమార్ రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు రంగం కూడా సిద్దం చేసుకుంటున్నారు. కాకపోతే ఇదే సీటు కోసం మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా పోటీ పడుతున్నారు. దాంతో వీరిద్దరిలో టిక్కెట్టు ఎవరికి దక్కుతుందో సస్పెన్స్ గా మారింది. విచిత్రమేమిటంటే ఇటు ఆనం అటు నేదురమల్లి ఇద్దరూ వైసిపిలో చేరలేదు. పార్టీలో చేరకుండానే సీటు విషయంలో ఇద్దరూ పట్టుపడుతున్నారు. అందుకనే ఆనం ఈనెల 13వ తేదీన విశాఖపట్నంలో జగన్ పాదయాత్ర సందర్భంగా వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకనే నేదురుమల్లి కూడా పార్టీలో చేరేందుకు తొందరపడుతున్నట్లుంది.