జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్రలో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలో యాత్రలో భాగంగా భీమవరం పట్టణంలో ఉన్న బీసీ సంఘాల నాయకులతో ఆటో యూనియన్లతో అలాగే మిగతా కులాలకు సంబంధించిన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యాయి వారితో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు.
వారి స్వార్ధ రాజకీయాలకోసం సమాజంలో కష్టపడి బతుకుతున్న సామాన్యుల మధ్య గోడలు కట్టారని పేర్కొన్నారు. సమాజాన్ని విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. మనమంతా మనుషులుగా ఉన్నా కులాలుగా విడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లు పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందంటున్నారని విమర్శించారు.
కాపు రిజర్వేషన్లపై బీసీ కులాలకు లాభనష్టాలు వివరించాలని అన్నారు. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడాల్సి వస్తే టీడీపీలో ఉన్న కాపు నాయకులు ఏం చేస్తున్నారు? అలాగే, ప్రతి బీసీ కులంలో ఉన్న నాయకులు వాళ్ళ వాళ్ల కులాల కోసం ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చింది ప్రశ్నించడం కోసమే అని పేర్కొన్నారు పవన్.
దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని మరొకసారి ఈ సమావేశంలో ప్రజలకు గుర్తుచేశారు.సమాజంలో తప్పులు జరిగితే కచ్చితంగా ప్రశ్నించే పార్టీగా జనసేన ఉంటుందని స్పష్టం చేశారు.