విజయవాడ దుర్గగుడి పాలక మండలి నుంచి కోడెల సూర్యలతను తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన విలువైన చీర మాయం వెనుక పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతే ప్రధాన కారణమని అధికారులు నిర్దారణకు వచ్చారు.
సీసీటీవీ ఫుటేజ్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించడంతో గురువారం రాత్రి సూర్యలతను పాలకమండలి నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉండవల్లికి చెందిన భక్త బృందం అమ్మవారికి సమర్పించిన చీర తీసుకెళ్లినట్లు విచారణలో తేలడంతో ఆమెపై వేటు వేశారు. ఈనెల 5న భక్తబృందం గత ఆదివారం నాడు రూ. 18 వేల విలువైన ఆషాఢ మాస సారెను కొందరు భక్తులు అమ్మవారికి బహూకరించగా.. ఆ చీర మాయం అయింది.
పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత కుమారిపై ఆరోపిస్తూ భక్త బృందం లిఖితపూర్వకంగా పాలకమండలి చైర్మెన్ గౌరంగబాబుకు ఫిర్యాదు చేశారు.
విషయం పెద్దది కావడం, మీడియాలో వార్తలు రావడంతో ఆలయ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మరోవైపు సూర్యలత తానేమీ భక్తులు పెట్టిన చీరను తీసుకెళ్లలేదని, తనకు భక్తులు ఇచ్చిన కాటన్ చీరను మాత్రమే తీసుకెళ్లానని ఆమె వాదించినప్పటికీ, సీసీటీవీ కెమెరాలు అమ్మవారి ముందున్న చీర ఎలా మాయం అయిందో కళ్లకు కట్టినట్టు చూపింది.
మొత్తానికి చేసిన పాపాని శిక్షపడింది. ఆలయ ప్రధానార్చకులు, సిబ్బందిని విచారించిన అనంతరం పాలకమండలి సభ్యురాలు సూర్యలత కుమారి చీరను తీసుకెళ్లినట్లు నిర్ధారణ కావడంతో ట్రస్ట్ బోర్డు నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.