సమస్యల పరిష్కారం, రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబునాయుడుపై ఫుల్లుగా ఫైరయ్యారు. భీమవరంలో కుల సంఘాల నేతలతో పవన్ సమావేశం అయ్యారు లేండి. ఆ సందర్భంగా మాట్లాడుతూ, రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. బిసిల్లో ఐక్యత లేకపోవటం వల్లే నష్టపోతున్నారంటూ కొత్త విషయాన్ని చెప్పారు. కుల రాజకీయాల వల్ల కొందరు లాభపడుతున్నారే కానీ కులాలు మాత్రం బాగుపడటం లేదంటూ నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నాయూ బ్రాహ్మణలు తమ సమస్య పరిష్కారం కోసం కలిసినపుడు వారికి చేయి చూపుతూ చంద్రబాబు బెదిరించి మాట్లాడటం దేనికి సంకేతమంటూ పవన్ ప్రశ్నించారు.
రిజర్వేషన్లు 150 శాతం కావాలి
రిజర్వేషన్లపై విధ కులాలకు చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రకారమైతే 150 శాతం రిజర్వేషన్లు కావాలంటూ పవన్ మండిపడ్డారు. చంద్రబాబుకు హమీలివ్వటంలో ఉన్న మనసు సమస్యల పరిష్కారంపై లేదంటూ మండిపడ్డారు. ఈ విషయంలో పవన్ నిజమే చెప్పారు. కాకపోతే చంద్రబాబు హామీలిచ్చిన సమయంలో తాను కూడా పక్కనే ఉన్న విషయాన్ని పవన్ మరచిపోయినట్లున్నారు. పైగా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే చొక్కాలు పట్టుకుని తాను నిలదీస్తానని చేసిన ప్రకటనను కూడా పవన్ ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. హామీల అమలు విషయంలో చంద్రబాబును నిలదీస్తున్న పవన్ మరి నాలుగేళ్ళలో తానెందుకు చంద్రబాబును నిలదీయలేదో చెప్పగలరా ?
చంద్రబాబు పక్కనే ఉన్నది మరచిపోయారేమో ?
ఓట్లు వేసిన వారికే సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు టిడిపిపై ఆరోపిస్తున్న పవన్ అన్యాయంపై ఎందుకు చంద్రబాబును నిలదీయటం లేదు ? కాపులకు రిజర్వేషన్లంటే బిసిలు దూరమైపోతారని చెబుతున్నారు. వ్యతిరేకంగా మాట్లాడితే కాపులు దూరమైపోతారని అంటున్న పవన్ రిజర్వేషన్లపై తన వైఖరేంటో ఎందుకు స్పష్టం చేయటం లేదు ? రిజర్వేషన్లు ఇవ్వటం ఇవ్వకపోవటం ప్రస్తుతం పవన్ చేతిలో లేని అంశం. కాపులకు రిజర్వేషన్లంటూ చంద్రబాబు తేనెతుట్టె మీద రాయేసినపుడు పవన్ కూడా పక్కనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు చంద్రబాబును వ్యతిరేకించకుండా ఇపుడు విమర్శలు చేయటం వల్ల ఏమి ఉపయోగం లేదు. కులాలు, రిజర్వేషన్లంటూ సమాజాన్ని చెడగొట్టారని ఒకవైపు అంటున్న పవన్ తాను మాత్రం కులాల వారీగా సమావేశాలు పెట్టటం గమనార్హం.