మామూలు జనాలకు ఒక విషయం అర్ధం కావటం లేదు. కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చంద్రబాబునాయుడు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ? రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత ప్రాధాన్యత ఒక్క నంద్యాలకే ఇస్తున్నారు. మామూలుగా అయితే రాయలసీమలోని చిత్తూరు జిల్లా మినహా మిగిలిన మూడు జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఫ్యాక్షన్ జిల్లాలుగా బాగా ఫేమస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. పై మూడు జిల్లాల నుండి అనేక మంది నేతలు చిత్తూరు జిల్లాలో చలాయించుకు తిరిగిన వారే కానీ చిత్తూరు జిల్లా నేతలు మాత్రం పై మూడు జిల్లాలో సాధించింది చాలా తక్కువనే చెప్పాలి. అటువంటిది చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు కర్నూలు జిల్లాలోని నంద్యాలకు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ?
మూడు సామాజికవర్గాలకే ప్రాధాన్యత
ఇప్పుడిదంతా ఎందకంటే, ఉప ఎన్నిక అనివార్యమైనప్పటి నుండి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎంత ప్రత్యేకంగా అంటే మిగిలిన నియోజకవర్గాల్లో దేనికి చివరకు సొంత నియోజకవర్గమైన కుప్పంకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎలాగంటే, నామినేటెడ్ పోస్టుల నియామకంలో ఒక్క నంద్యాలకు చెందిన ఐదుగురు నేతలకే ఐదు పోస్టులు కట్టబెట్టారు. ఈ నియోజకవర్గంలో ముస్లింలు, రెడ్లు, బలిజ సామాజికవర్గాలు ఎక్కువ. అందుకనే పై మూడు సామాజికవర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే సామాజికవర్గాల సమతూకం చూసుకుంటున్నారని అర్ధమవుతోంది.
ఐదు పోస్టుల్లో నంద్యాల నేతలు
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను శాసనమండలి ఛైర్మన్ గా నియమించారు. తర్వాత నౌమన్ కు ఉర్దు అకాడమీ కార్పొరేషన్ ఛైర్మన్ ఇచ్చారు. కోయిలకుంట్ల మాజీ ఎంఎల్ఏ, సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డిని పౌర సరఫరల కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు. డాక్టర్ బాబన్ ను దూదేకుల సంఘం కార్పొరేషన్ ఛైర్మన్ ను చేశారు. రామచంద్రరావును కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారు. తాజాగా ఏవి సుబ్బారెడ్డికి ఏపి సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు. ఈ ఆరుగురిలో ఒక్క చల్లా రామకృష్ణా రెడ్డి తప్ప మిగిలిన ఐదుగురూ నంద్యాలకు చెందిన వారే కావటం గమనార్హం. శాసనమండలి ఛైర్మన్ కార్పొరేషన్ క్రిందకు రాకపోయినా అంతకన్నా ఎక్కువ స్ధానంలోనే కూర్చోబెట్టారు.
అభివృద్ధి పనులను కూడా స్పీడ్ చేశారు
కార్పొరేషన్ ఛైర్మన్లు ఇవ్వటమే కాకుండా ఉప ఎన్నికల సమయంలో నంద్యాల అభివృద్ధికి ఇచ్చిన హామీలు దాదపు ఒక కొలిక్కి వస్తున్నాయి. ప్రధానమైన రోడ్ల విస్తరణ దాదాపు అయిపోవచ్చింది. అలాగే క్వాలిటీ సంగతిని పక్కన పెట్టేస్తే ఇళ్ళ నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ విధంగా చిన్నా పెద్దా హామీలన్నింటినీ ఏదో ఒక కొలిక్కి తెచ్చేస్తున్నారు చంద్రబాబు. అభివృద్ధిపనులను వేగవంతం చేయటం కోసం సిఎంవో నుండి ప్రత్యేకంగా మానిటర్ చేయిస్తున్నట్లు సమాచారం.
నంద్యాల నుండి పోటీ చేస్తారా ?
ఇవన్నీ చూసిన తర్వాత నంద్యాలపై చంద్రబాబుకు అంత ప్రేమ ఎందుకు వచ్చిందనే ప్రశ్న వస్తోంది. జిల్లాలోని నేతల నుండి అందిన సమాచారం ఏమిటంటే, చంద్రబాబు కుటుంబంలో నుండి ఎవరో ఒకరు వచ్చే ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీలో పోటీ చేయబోతున్నారట. చంద్రబాబు, లోకేష్ చివరకు బ్రాహ్మణి పేరు కూడా వినబడుతోంది. కుప్పం నియోజకవర్గాన్ని కొడుకు లోకేష్ అప్పగించేసి చంద్రబాబు నంద్యాల నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. లేకపోతే విజయనగరం జిల్లాలో దత్తత తీసుకున్న పెద్దలబుడు గ్రామాన్నే పట్టించుకోని చంద్రబాబు నంద్యాలపై ఎందుకంత ప్రేమ చూపుతున్నారు ? ప్రచారం సంగతి పక్కన పెడితే జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే మాత్రం అందరిలోనూ అనుమానాలు బలపడుతున్నాయి.