ముస్లిం మైనారిటీల ఓట్ల కోసం చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్నారు. సంబంధం లేకపోయినా తాను ముస్లిం సామాజికవర్గానికి ఎంతెంత చేసింది చెబుతున్నారు. అదే సమయంలో తాను బారతీయ జనతా పార్టీకి బద్ద విరోధిని అని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం సందర్భం లేకపోయినా అనవసర విషయాలను కూడా ప్రస్తావిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో టిడిపికి దూరమైన ముస్లిం సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకునేందుకు కొత్త ఎత్తులేస్తున్నారు.
ప్లాన్ ప్రకారమే మంత్రివర్గంపై ప్రకటన
హజ్ యాత్రకు వెళ్ళే యాత్రీకులతో చంద్రబాబు అమరావతిలో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ముస్లిం సామాజికవర్గంలోని నేతలతో మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనం. మామూలుగా అయితే, మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీ లాంటి విషయాలను చంద్రబాబు ఎవరితోనూ చర్చించరు. అటువంటిది తన మంత్రవర్గంలో తొందరలో ఒక ముస్లింను తీసుకోబోతున్నట్లు వారిముందు ప్రకటించారు. ముస్లింలలో ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలా ? అన్న విషయంపై తాను కసరత్తు చేస్తున్నట్లు చెప్పటంలో పెద్ద ప్లానే ఉంది.
బిజెపి కారణంగానే ముస్లింలకు ఇవ్వలేదు
గతంలో చేసిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఎప్పుడు కూడా ముస్లింలు తీసుకునే విషయమై ఆలోచించలేదు. పై వర్గాల నుండి విజ్ఞప్తులన్నప్పటికీ పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పట్లో బిజెపితో కలుసున్నారు కాబట్టే. అంటే ఇప్పటి వరకూ మంత్రివర్గంలో ముస్లింలు, ఎస్టీలకు అవకాశం ఇవ్వకుండానే చంద్రబాబు నాలుగేళ్ళు గడిపేశారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కూడా పై సామాజికవర్గాలకు మంత్రిపదవులు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావం పడే అవకాశాలున్నాయన్న ఉద్దేశ్యంతోనే మంత్రివర్గ విస్తరణకు రెడీ అవుతున్నారు.
గుజరాత్ అల్లర్లపై మాట్లాడిన చంద్రబాబు
పనిలో పనిగా తన హయాంలో ముస్లింలకు ఎంత సేవ చేసింది చెప్పుకొచ్చారు. ముస్లింల సంక్షేమానికి తాను చేసిన కృషిని వివరించారు. చంద్రబాబు సమావేశం పూర్తిగా ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. ఎలాగంటే, ముస్లింల సంక్షేమానికి తాను చేస్తున్న కృషి గురించి చెప్పుకోవటంలో తప్పేమీలేదు. కానీ సంబంధం లేని గుజరాత్ అల్లర్లలో ముస్లింల ఊచకోత, అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోడి రాజీనామాకు తాను పట్టుపట్టడం తదితర విషయాలను కూడా చంద్రబాబు ప్రస్తావించటమే విచిత్రంగా ఉంది.
ఫిరాయింపులకు అవకాశం ఇస్తారా ?
పోయిన ఎన్నికల్లో టిడిపి తరపున ముస్లిం, ఎస్టీ అభ్యర్ధులు గెలవలేదు. దాంతో వైసిపి తరపున గెలిచిన జలీల్ ఖాన్, అత్తార్ చాంద్ భాషా, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, కిడారి సర్వేశ్వర్రావు లాంటి ముస్లిం, ఎస్టీ ఎంఎల్ఏలను టిడిపిలోకి లాక్కున్నారు. ఇపుడు వారిలో ఎవరో ఒకరికి మంత్రిపదవి ఇస్తారా ? లేకపోతే టిడిపి తరపున ఎంఎల్సీలుగా ఎంపిక చేసిన ఎంఏ షరీఫ్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారా అన్నది సస్పెన్స్ గా మారింది.