తెలంగాణలో కోమటిరెడ్డి సోదరులు.. పరిచయం అక్కరలేని నేతలు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంటే కోమటి రెడ్డి బ్రదర్స్.. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కాంగ్రెస్ అన్నంతలా ఉంటుంది వారి పట్టు. టీఆర్ఎస్ అన్నా.. సీఎం కేసీఆర్ అన్నా.. మంత్రి జగదీశ్ అన్నా.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడుతారు.. అయితే, వారి గురించి ఓ పుకారు షికారు కొడుతోంది. అదేమిటంటే.. కోమటిరెడ్డి బ్రదర్స్ను గులాబీ గూటిలో చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారనీ, ఈ మేరకు నల్లగొండ జిల్లా నేతలతో కూడా ఫోన్లో మాట్లాడారనే ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమోగానీ.. సీఎం కేసీఆర్ ఏదైనా చేయగలరనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, ప్రత్యర్థిని ఎప్పుడూ ప్రత్యర్థిగానే చూడకుండా పక్కకు చేర్చుకోవడంలో కేసీఆర్ పంథానే వేరు. ఈ విషయం అనేకసార్లు రుజువు అవుతూనే ఉంది.
నిజానికి... నల్లగొండలో ముఖ్య అనుచరుడి హత్య, ఎమ్మెల్యే పదవి రద్దు తర్వాత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో అందరికీ తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఎమ్మెల్యేగా కొనసాగించాలని సాక్షాత్తు హైకోర్టు తీర్పు ఇచ్చినా.. ఇంతవరకూ ఎమ్మెల్యేగా గుర్తించలేదు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు కూడా హైకోర్టులో నడుస్తోంది. అంతేగాకుండా.. సీఎం కేసీఆర్కు దమ్ముంటే.. నల్లగొండలో తనపై పోటీ చేయాలని అనేకసార్లు కోమటిరెడ్డి వెంకటర్రెడ్డి సవాల్ విసిరారు. ఇలా పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్కు సీఎం కేసీఆర్ గాలం వేస్తున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో కూడా నల్లగొండ జిల్లా రాజకీయాలపై సీఎం కేసీఆర్ మాట్లాడారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే వీటిపై మాత్రం కోమటిరెడ్డి సోదరులు స్పందించడం లేదు.
అయితే.. కేసీఆర్ను ఇష్టారీతిలో మాట్లాడే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి టీఆర్ఎస్ లో ఎలా చేరుతారనీ, ఆ ఛాన్సే లేదని పలువురు అంటుండగా.. మరికొందరు మాత్రం అలా ఎందుకనుకోవాలి..అంటూ పలు ఉదాహరణలు చెబుతున్నారు. గతంలోనూ వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన కోండా దంపతులు సీఎం కేసీఆర్ను ఎన్నెన్ని మాటలు అన్నారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొండా సురేఖ అయితే ఓ స్థాయిలో కేసీఆర్పై మండిపడ్డారు. అలాంటి కోండా దంపతులు గత ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా కొండా సురేఖ, ఎమ్మెల్సీగా ఆమె భర్త మురళి కొనసాగుతున్నారు.
అంతెందుకు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ లీడర్గా మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా కేసీఆర్పై విరుచుపడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదా..? అంటూ పలువురు నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరితో అందులో ఆశ్చర్యమేమీ లేదని చెబుతున్నారు. మరోవైపు ఈనెల 13, 14వ తేదీల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పర్యటన ఉంది. ఈ లోపే కోమటిరెడ్డి సోదరులను సీఎం కేసీఆర్ టీఆర్ఎస్లో చేర్చుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.