ఏపిఉద్యోగుల సంఘం నేత అశోక్ బాబుకు ఉద్యోగులు ఈరోజు చుక్కలు చూపించారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఈరోజు ఉదయం విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సిపిఎస్) రద్దు చేయాలంటూ ఉద్యోగులు ప్రధానంగా టీచర్లు ఆందోళన చేస్తున్నారు. హటాత్తుగా పిలవని పేరంటం అన్నట్లుగా అశోక్ బాబు కూడా జింఖానా మైదానంకు వచ్చారు. సరే, పిలవకపోయినా ఎలాగూ వచ్చాడు కదాఅని ఉపాధ్యాయ సంఘం నేతలు అశోక్ ను వేదికపైకి ఆహ్వానించారు.
వ్యతిరేకంగా నినాదాలు
ఎప్పుడైతే నేతలు ఆశోక్ ను వేదికపైకి ఆహ్వానించారో ఆందోళనలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు నిరసరగా నినాదాలు చేస్తున్న ఉద్యోగులు ఒక్కసారిగా అశోక్ కు వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. ఉద్యోగుల్లో చీలికలు తచ్చి ఉద్యమాల్లో చీలిక తెచ్చే అశోక్ లాంటి వాళ్ళను పిలవద్దంటూ గట్టిగా నినాదాలు మొదలుపెట్టారు. అశోక్ గో బ్యాక్ అంటూ ఉద్యోగుల అరుపులతో మైదానమంతా ఒక్కసారిగా మారుమోగిపోయింది.
బిత్తరపోయిన నేతలు
దాంతో ఉద్యోగుల సంఘం నేతలతో పాటు అశోక్ కూడా బిత్తరపోయారు. అయితే, ఉద్యోగుల నినాదాల మధ్యే వేదికపైకి ఎక్కిన అశోక్ ను వెంటనే వేదిక దిగిపోవాలంటూ నినాదాల జోరును మరింతగా పెంచారు. దాంతో ఉపాధ్యాయ సంఘం నేతలు జోక్యంచేసుకుని అశోక్ కు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వదంటూ వేడుకున్నారు. మొత్తానికి నేతలు కాసేపు బ్రతిమలాడుకున్న తర్వాత చేసేది లేక ఉద్యోగులు మవునంగా ఉండిపోయారు. ఈమధ్య చంద్రబాబుకు అనుకూలంగా అశొక్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఉద్యోగులను కూడా చంద్రబాబుకు అనుకూలంగా మలచాలని అశోక్ చేస్తున్న ప్రయత్నాలతో ఉద్యోగులంతా మండిపోతున్నారు