గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. జిల్లాలోని గురజాల ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ చేస్తున్నారన్న ఆరోపణల నేపధ్యంలో ఓ కమిటీ మైనింగ్ ఏరియాలోకి వెళ్ళటానికి వైసిపి తరపున వెళ్ళటానికి రెడీ అవ్వగా వారిని పోలీసులు యధావిధిగా అరెస్టు చేశారు. అంతే కాకుండా సదరు నేతలను వారి ఇళ్ళలో నుండి బయటకు రాకుండా అడ్డుకోవటంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత మొదలైంది.
ఊపందుకున్న ఎంఎల్ఏ మైనింగ్
ఇంతకీ విషయం ఏమిటంటే, యరపతినేని సంవత్సరాల తరబడి మైనింగ్ చేసుకుంటున్నారు. ఎంఎల్ఏ చేసుకుంటున్న మైనింగ్ యాక్టివిటి 2014 తర్వాత ఒక్కసారిగా ఊపందుకుంది. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావటం, గుంటూరు జిల్లా రాజధాని జిల్లా కావటమే అందుకు ప్రధాన కారణమని వేరే చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే రాజధాని జిల్లాకు ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగిపోయింది. దాంతో ఎంఎల్ఏ మైనింగ్ కూడా ఊపందుకుంది. అధికార ఎంఎల్ఏ కావటంతో మైనింగ్ ప్రాంతం కూడా విస్తరించింది. దాంతో వివాదాలు మొదలయ్యాయి.
కోర్టు అక్షింతలు వేసిన కనబడని మార్పు
ఎంఎల్ఏ అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. దాంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులపై విచారణ జరిపిన కోర్టు ఎంఎల్ఏ అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు నిర్ధారించి ప్రభుత్వానికి బాగా అక్షింతలేసింది. మైనింగ్ వ్యవహారాలపై వెంటనే ఒక నివేదిక ఇవ్వాలంటు చెప్పి మైనింగ్ మొత్తాన్ని నిలిపేయాలంటూ ఆదేశించింది. అయినా ప్రభుత్వంలో పెద్దగా చలనం కనబడలేదు.
పట్టణంలో ఉద్రిక్తత
ఆ విషయం మీదే ప్రధాన ప్రతిపక్షం వైసిపి నిజనిర్ధారణ కమిటీ అంటూ ఎంఎల్ఏ మైనింగ్ చేస్తున్న పిడుగురాళ్ళ, దాచేపల్లి మండలాల్లోని గనులను చూసేందుకు రెడీ అయ్యింది. ఎంఎల్ఏ అందుకు సహజంగానే ఒప్పుకోరు కదా ? ఇక్కడ కూడా అదే జరిగింది. వైసిపి నరసరావుపేట ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయటంతో పరిస్దితి ఉద్రిక్తంగా మారింది. ఒక విధంగా పట్టణంలో వైసిపి కార్యకర్త ఎవరు కూడా రోడ్డుపై తిరిగేందుకు లేకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు.