రాజకీయం ఒక రణరంగం ఎప్పుడు ఎటునుండి శత్రువుల శరపరంపర దూసుకువస్తుందో తెలియదు. అన్నింటిని అవలోకించి ముందుగనే ఇంకా అవసరమైతే సమయాను కూలంగా మార్చుకునేలా నిర్ణయాలను తీసుకోగలగటమే ఒక రాజకీయనాయకుని రాజనీతిఙ్జతకు పరిణితికి నిదర్శనం.
ఆధునిక రాజకీయపార్టీల అధినేతల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు చురుకైన సమర్ధవంతమైన రాజకీయవేత్తని ఎలాంటి సంశయం లేకుండా చెప్పవచ్చు. ఈ విషయాన్ని ప్రధాని నరెంద్ర మోడీ నుండి - అనుభవమున్న అనేకమంది భారత రాజకీయనాయకుల వరకు నిశ్శంశయంగా పలుసందర్భాల్లో చెబుతూనే ఉంటారు. సచివాలయానికి రాకుండా నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ శరవేగంగా పనులు నిర్వహిస్తూ ఉంటారు.
ఆయన చేసే పర్యటనలలో నెలకోక సారి దేశ రాజధాని తప్పకుండా ఉంటుంది. ఈ ప్రదక్షిణల ద్వారా కేంద్రంలో ఉన్న బీజేపీకి తన మద్దతు ఉందని భరోసా యివ్వటమే కాదు, మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లోను, నిన్నటి రాజ్యసభ ఉపాధ్యక్షుని ఎన్నికలో నిస్సంశయంగా ఋజువు అయింది. అయితే కేసీఆర్ ఢిల్లీ పర్యటన కారణాలపై మాత్రం విభిన్న ఊహాగానాలు వ్యక్తమవుతూ ఉంటాయి.
రెండు నెలల కిందట కేంద్రం ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం చేసింది, దీనికి మేం మద్దతిస్తామంటూ కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్లివచ్చిన అనంతరం అధికారికంగా ప్రకటించారు. తరువాత ఎవరూ ముందస్తు గురించి మాట్లాడ లేదు. ఇదే సమయంలో కేంద్రంతో శతృత్వం పెంచుకుని తన కొంప తానే తగల బెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ లోని అధికార టీడీపీ తాము కేంద్రంతో కలసి ఎన్నికలు నిర్వహించేదిలేదని, విడివిడిగానే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఆ తరవాత మాట మార్చి కేసీఆర్ కూడా టిడిపి మార్గంలోకే వచ్చినట్లు భావించవలసివస్తుంది.
కాని కేసిఆర్ వ్యక్తం చేసిన తీరు నొప్పించక తానొవ్వక అన్నట్లు గౌరవంగా ఉంది. లోక్సభ ఎన్నికలతో శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తే కేసీఆర్ అనేక రాజకీయసమస్య ల్లో ఇతర వ్యూహాల్లో అనవసరంగా చిక్కుకునే అవకాశం ఉంది. "కర్ర విరగకూడదు-పాము చావకూడదు" అన్నఆయన నమ్మే సాధారణ పద్దతి లోనే ఏ ప్రయోజనాన్ని కూడా వదులుకోకుండా వ్యూహం రచించించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రం లోక్సభతో కాకుండా ముందస్తుగానే శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని, కేంద్రం సహకరించాలని కేంద్రాన్ని కోరబోతున్నట్లు తెలుస్తుంది. కేంద్రంలోని బీజేపీ మద్దతుతో ఒకేసారి లోక్సభ, శాసనసభ ఎన్నికలకు వెళితే టీఆర్ఎస్ "ముస్లిం ఓటు బాంక్" ను కోల్పోవాల్సి వస్తుందని, అందుకే ముందస్తుగా తెలంగాణాలో శాసనసభకు ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని ఢిల్లీ పెద్దలను సమయోచితంగా అంగీకారంకోసం అనునయించబోతున్న ట్లు సమాచారం.
అంతేకాదు శాసనసభ ఎన్నికల్లో మాకు సహకరిస్తే రానున్న లోక్సభ ఎన్నికల్లో బిజెపికి తమ మద్దతు ఉంటుందని చెప్పి తన వాదనకు బలం చేకూర్చుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ ప్రణాళిక అమలుకు నోచుకుంటే రానున్న అక్టోబర్ నెలలో తెలంగాణా శాసనసభ రద్ధై, ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశమున్నట్లు, తరవాత దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్-సభ ఎన్నికల్లో టిఆరెస్ పరోక్షంగా బిజెపిని సమర్ధించ వచ్చనే తెలుస్తుంది.
అదే విఙ్జత ఏపి సిఎంకు లేకపోవటం తెలంగాణా సిఎంలోని రాజకీయ పరిణితి మోడీ పార్లమెంట్ లో టిడిపి అవిశ్వాసం సందర్భంగా హైలైట్ చేశారు. అయితే ఎవరి ఇబ్బందులు వారికి ఉండనే ఉన్నాయని చెప్పొచ్చు.