వచ్చే ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓట్లలో చీలక తప్పదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరూ అదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాక్టివ్ అయ్యే కొద్దీ కొన్ని జిల్లాల్లోని కాపు సామాజికవర్గం ఓట్లలో మెజారిటీ ఓట్లు జనసేన అభ్యర్ధులకే పడతాయని ప్రచారం జరిగింది. అయితే, గ్రౌండ్ లో జరుగుతున్నది చూస్తుంటే ప్రచారంపై అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.
పాదయాత్రకు పెరుగుతున్న ఆధరణ
అనుమానాలు ఎందుకంటే, గడచిన నెల రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రె్డ్డి పాదయాత్ర చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ, నియోజకవర్గాలు మారేకొద్దీ జగన్ యాత్రకు జనాల ఆధరణ పెరుగుతోందే కానీ తగ్గటం లేదు. ఈ స్ధాయిలో జనాధరణ ఎందుకు వస్తున్నదో ఎవరికీ అర్ధం కావటం లేదు. తూర్పు గోదావరి జిల్లాలోని ఆధరణే అంతకుముందు పశ్చిమగోదావరి జిల్లా పాదయాత్రలో కూడా కనబడింది.
కాపులను అడ్డం పెట్టుకునే డ్రామాలు
ఇక్కడ రెండు విషయాలు గుర్తు చేసుకోవాలి. కాపులకు బిసిల రిజర్వేషన్ కల్పించింది చంద్రబాబునాయుడే అంటూ టిడిపి ఊదరగొట్టేస్తోంది. చంద్రబాబు అండ్ కో చెప్పుకుంటున్నట్లు కాపులకు బిసిల రిజర్వేషన్లు వర్తించేశాయా ? పోయిన ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకూ జరిగిన ప్రతీ డ్రామా అందరికీ తెలిసిందే. టిడిపి లెక్క ప్రకారం కాపులంతా చంద్రబాబుకే మళ్ళీ ఓట్లేస్తారు. అదే సమయంలో పవన్ కూడా ప్రధానంగా కాపు సామాజికవర్గం ఓట్లను దృష్టిలో పెట్టుకునే రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఇతర పార్టీల తరపున కాపులు పోటీ చేసినా కాపుల ఓట్లలో అధికభాగం జనసేన అభ్యర్ధులకే పడతాయనే ప్రచారం జరుగుతోంది.
జనసేనకే పడతాయనే గ్యారెంటీ లేదా ?
టిడిపి, జనసేన నేతల వాదనలు నిజమే అయితే కాపులు జగన్ పార్టీవైపు తొంగి కూడా చూడకూడదు. కానీ క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదేంటి ? పాదయాత్రలో జగన్ కు కాపు సామాజికవర్గం బ్రహ్మరథం పడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. మరి, ఇదెలా సాధ్యమైంది ? ఎలాగంటే, జనసేన అభ్యర్ధులు పోటీలో ఉన్నంత మాత్రాన కాపులందరూ పవన్ పార్టీకే పట్టం గడతారనే ప్రచారంలో వాస్తవం లేదని అర్ధమవుతోంది. ఎందుకంటే ప్రజారాజ్యంపార్టీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే రేపటి ఎన్నికల్లో ఓట్ల చీలిక తప్పదని స్పష్టమవుతోంది. అప్పట్లో కాపుల్లో మెజారిటీ ఓట్లు పిఆర్పీకే పడినా అభ్యర్ధులు గెలవలేదు. పైగా పార్టీ అధ్యక్షుడు చిరంజీవే ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
ఎవరికి ఎక్కువ పడితే వారిదే గెలుపు
ఎందుకంటే, కాపు సామాజికవర్గంలోని నేతలు వివిధ పార్టీల మధ్య చీలిపోయున్నారు. రేపటి ఎన్నికల్లో ఆయా నేతలు ఏ పార్టీ తరపున పోటిచేసినా వారి మద్దతుదారులు, ఓటర్లు వాళ్ళకే ఓట్లు వేసే అవకాశాలు ఎక్కువున్నాయి. అది వైసిపితో పాటు టిడిపికి కూడా సమానంగా వర్తిస్తుంది. ఈ విషయాలన్నీ కాపు సామాజికవర్గంలోని నేతలు చెబుతున్న లాజిక్కే. అంటే ఇపుడు ప్రచారం జరుగుతున్నట్లుగా కాపుల ఓట్లు గంపగుత్తగా జనసేనకు మాత్రమే పడుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకనే వచ్చే ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓట్లలో చీలిక తప్పదని అర్ధమవుతోంది. అయితే, చీలిపోయే ఓట్లలో ఏ పార్టీ అభ్యర్ధికి ఎక్కువ ఓట్లు పడుతుందనే విషయం మీదే ఆ పార్టీ విజయం ఆధారపడి ఉంటుంది.