ప్రధానమంత్రి నరేంద్రమోడి, తెలంగాణా సిఎం కెసిఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి చెలరేగిపోయారు. మోడి, కేసిఆర్ ఇద్దరు కూడా బడా పారిశ్రామికవేత్తలకు లోన్లు ఇస్తున్నారు తప్ప సాధారణ పారిశ్రామికవేత్తలకు, ఔత్సాహికులకు రుణాలను ఇచ్చి ప్రోత్సహించటం లేదంటూ మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో రాహూల్ ప్రత్యేకంగా మహిళా సంఘాలతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ వస్తే గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఉండదు
మోది తీసుకొచ్చిన జిఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలొ అధికారంలొకి వచ్చిన తర్వాత ఐదు రకాల ట్యాక్సులుండవంటూ భరోసా ఇచ్చారు. అంటే ఎప్పటికి వస్తుందో చెప్పలేరు కాబట్ఏ ధైర్యండా జనాలకు హామీని ఇచ్చేశారు. తమ ప్రభుత్వంలో ఏ విషయంలోనూ పలు రకాల పన్నులు కట్టాల్సిన అవసరం ఉండదని కూడా చెప్పారు. సామాన్యులు కట్టే పన్నులన్నింటినీ మోడి ప్రభుత్వం బడా బాబులకు నజరానాలుగా ఇచ్చేస్తోందంటూ ఎద్దేవా చేశారు.
15 మంది రూ. 2.5 లక్షల కోట్ల మాఫీ
గడచిన రెండేళ్ళల్లో మోడి ప్రభుత్వం 15 మంది పారిశ్రామికవేత్తలకు రూ. 2.5 లక్షల కోట్ల రుణాలు మాఫి చేసిందంటూ మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో సామాన్యులకు ఒరిగిందేమీ లేదని కూడా ఎద్దేవా చేశారు. మహిళలు ఎదగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. డ్వాక్రా మహిళలు, రైతులు తీసుకున్న రుణాలను మాత్రం రద్దు చేయటానికి మోడి ప్రభుత్వం ఇష్టపడటం లేదంటూ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం రాగానే మహిళలకు, రైతులకు అందరికీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలు రాజకీయంగా, ఆర్ధికంగా ముందడుగు వేస్తేనే సమాజం అభివృద్ధి సాధించినట్లవుతుందని రాహూల్ అన్నారు. నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల ముందు పడిన సమస్యలను రాహూల్ గుర్తు చేశారు.