చూస్తుంటే తెలుగుదేశంపార్టీ చాలా ఓవర్ చేస్తున్నట్లే ఉంది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో వైఎస్ భారతి పేరును టిడిపి నేతలు ఎందుకు రచ్చకీడుస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఏమాసించి టిడిపి నేతలు భారతి పేరును బజారుకు లాగుతున్నారు ? జగన్ సతీమణి పేరును వివాదాల్లోకి లాగటాన్ని రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వాళ్లు ఎంత వరకూ హర్షిస్తారు ? అదికూడా ఎన్నికలకు ముందు ఓ వ్యూహాత్మకంగా భారతి పేరును టిడిపి రోడ్డుమీదకు లాగుతోంది.
ఏ ఒక్కరికీ శిక్షపడలేదే
జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటికి చాలామందిని కోర్టు విచారించిన విషయం అందరికీ తెలిసిందే. కోర్టు విచారించిన వారిలో ఉన్నతాధికారులు, రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలున్నారు. గడచిన ఏడేళ్ళుగా కేసులు విచారణ జరుగుతున్నదే కానీ ఏ ఒక్కరినీ దోషిగా తేల్చలేదు. పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో చాలామందికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని న్యాయస్ధానం కేసులను కొట్టేసింది. మరికొంతమందిపై విచారణను నిలిపేసింది. టిడిపి ఆరోపిస్తున్నట్లుగా జగన్ లక్ష కోట్ల రూపాయలు తిన్నారన్నది ఇప్పటికైతే కేవలం రాజకీయంగా ఆరోపణలు చేయటానికి మాత్రమే టిడిపికి ఉపయోగపడుతోంది.
భారతి పేరుపై రచ్చ చేస్తున్న టిడిపి
ఇటువంటి ఆరోపణలతోనే పోయిన ఎన్నికల్లో జగన్ పై చంద్రబాబునాయుడు పై చేయి సాధించారు. జగన్ లక్ష కోట్లరూపాయలు తిన్నారో లేదో తెలీదు కానీ టిడిపి అండ్ కో జగన్ పై విజయవంతంగా లక్ష కోట్ల ముద్ర అయితే వేసేసింది. చంద్రబాబు తరపున ఓవర్ యాక్షన్ చేయటానికి ఎటూ మద్దతుగా నిలబడే మెజారిటీ మీడియా ఉంది కాబట్టి టిడిపి ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. ఈ నేపధ్యంలోనే వైఎస్ భారతి పేరును కూడా తనకు మద్దతుగా నిలబడే మీడియా ద్వారా టిడిపి నేతలు రోడ్డుమీదకు లాగి రచ్చ చేస్తున్నారు.
భువనేశ్వరి, బ్రాహ్మణి పేర్లను కూడా ప్రస్తావించ లేదే !
గతంలో చంద్రబాబు మీదకాని కొడుకు లోకేష్ మీదకాని అవినీతి ఆరోపణలు వచ్చినపుడు జగన్ కానీ వైసిపి నేతలు కానీ నారా భువనేశ్వరి పేరును లేదా నారా బ్రాహ్మణి పేరును కనీసం ప్రస్తావన కూడా తేలేదు. లోకేష్ ప్రతీ ఏడాది ప్రకటిస్తున్న ఆస్తుల వివరాలు ఎంత కామిడీగా ఉంటున్నా ఇంట్లో ఆడవాళ్ళ పేర్లతో వైసిపి ఏరోజూ రాజకీయం చేయలేదు. ఆరోపణలు, విమర్శలు ఏమున్నా చంద్రబాబు, లోకేష్ వరకే పరిమితం చేస్తున్నారు. చంద్రబాబు సతీమణిని, కోడలును రోడ్డుమీదకు లాగాలంటే వైసిపికి అవకాశాలే ఉండవా ?
కోర్టులే తేలుస్తాయి కదా ?
నిజంగానే జగన్ అక్రమాస్తుల కేసుల్లో జగన్ సతీమణి భారతి పేరుందనే అనుకుందాం. టిడిపికి ఎందుకంత ఓవర్ యాక్షన్ ? అది పూర్తిగా జగన్ కుటుంబానికి సంబంధించిన సమస్య. .జగన్ తరపు లాయర్లు, సిబిఐ, ఈడి విచారణాధికారులు తేల్చుకోవాల్సిన సమస్య. తెలుగుదేశంపార్టీకి ఏ విధంగా కూడా సంబంధం లేదు. మరి, ఏ రకంగా చూసినా తనకు సంబంధంలేని విషయాల్లో టిడిపి తలదూర్చి ఓవర్ యాక్షన్ చేస్తోందనే అనిపిస్తోంది. మరి ఈ ఓవర్ యాక్షన్ ఫలితం ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే.