ఆంధ్రప్రదేశ్ లో క్రింద స్ధాయి నుండి పై స్ధాయి వరకూ అవినీతి పెరిగిపోయింది. అందుకనే త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై చార్జిషీటు తీసుకువస్తున్నాం. అంటూ బిజెపి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ఉన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మీడియాతో మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో బాగా అవినీతి పెరిగిపోయిందట. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ స్ధాయిలో జరిగిందనే విషయాలపై వివరాలు సేకరిస్తున్నట్లు కూడా చెప్పారు. అంటే నాలుగేళ్ళ పాటు టిడిపితో కలిసి కాపురం చేసిన బిజెపికి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో తెలీకుండానే ఉంటుందా ?
ప్రజల ముందు పెడితే ఏమవుతుంది ?
అలాగే, చంద్రబాబు పాలనలో ప్రతీ వ్యవస్ధ కూడా భ్రష్టుపట్టిందన్నది వాస్తవం. పైగా చంద్రబాబు అవినీతి మొత్తాన్ని ప్రజల ముందుకు తెస్తామని కూడా మురళీ చెబుతున్నారు. చంద్రబాబు అవినీతిని బిజెపి కొత్తగా ప్రజల ముందుకు తెచ్చేదేముంది ? చంద్రబాబు అవినీతిని బిజెపి ప్రజల ముందుంచితే ఏమవుతుంది ?
కాగ్ రిపోర్టు, పిడి ఖాతాల కుంబకోణం సరిపోదా ?
నాలుగేళ్ళపాటు కలిసి కాపురం చేసిన రెండు పార్టీలు ఈమధ్యే విడిపోయాయి. అప్పటి నుండి ఒకరి లోపాలు మరొకరికి కనిపిస్తున్నాయి. నాలుగేళ్ళపాటు ఏపి అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అన్నీ విధాల సాయం చేసిందని, ఏపికి సాయం చేసినట్లుగా దేశంలోని మరే రాష్ట్రానికి నరేంద్రమోడి ప్రభుత్వం చేయలేదని చంద్రబాబు ఎన్ని సార్లు చెప్పారో ? అదే విధంగా ఏపిలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని చెప్పిన బిజెపి నేతలు విడిపోయిన తర్వాత మాత్రం అభివృద్ధి పేరుతో అవినీతి పెరిగిపోయిందని విమర్శిస్తున్నారు. చంద్రబాబుపై నిజంగా చార్జిషీటు పెట్టాలంటే ఇంకా అవినీతిపై వివరాలు సేకరించాల్సిన అవసరం ఏంటి ? పట్టిసీమలో అవినీతి జరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) రిపోర్టు సరిపోదా ? పిడి ఖాతాల రూపంలో రూ. 53 వేల కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఆరోపణలు సరిపోదా ?