చూడబోతే వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే భయమే చంద్రబాబునాయుడును కాంగ్రెస్ కు దగ్గర చేస్తున్నట్లుంది. నాలుగేళ్ళ పాలన మొత్తం అవినీతి, అస్తవ్యస్ధ పాలనే. దాంతో చంద్రబాబు పాలనపై జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది. జనాల్లో వ్యతిరేకత ఒక ఎత్తైతే, పార్టీలోని నేతల మధ్య వివిధ జిల్లాల్లో కుమ్ములాటలు ఇంకో ఎత్తు. దాంతో ఇంటా, బయటా చంద్రబాబుకు ఇబ్బందులే అన్న విషయం స్పష్టమైపోయింది.
పాదయాత్రకు బ్రహ్మరథం
అదే సమయంలో జగన్ పాదయాత్రకు జనాలు బ్రహ్మరథం పడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. ప్రజా సంకల్పయాత్రలో అలుపెరగకుండా జగన్ జిల్లాను దాటి ఇంకో జిల్లాకు సాగిపోతూనే ఉన్నారు. మొన్ననే తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని విశాఖపట్నం జిల్లాలోకి అడుగుపెట్టారు. రాయలసీమ జిల్లాల్లో యాత్ర జరిగినంత కాలం ఒకలాగున్న జనస్పందన కోస్తా జిల్లాల్లోకి ప్రవేశించేసరికి ఊపందుకుంది. ఇక, ఉభయగోదావరి జిల్లాల్లో ప్రజాస్పందన గురించి చెప్పనే అక్కర్లేదు.
మద్దతిచ్చే పార్టీ ఒక్కటీ లేదు
పాదయాత్ర విషయంలో జగన్ కు వస్తున్న ఆధరణ చూసిన తర్వాత చంద్రబాబులో ఒక విధంగా ఆందోళన మొదలైందనే చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీల్లో ఒక్కటి కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలబడేది లేదు. ఈమధ్యనే బిజెపితో హనీమూన్ ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో బిజెపి నేతలు ప్రతీ రోజు చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు, పాలనపై విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు.
చంద్రబాబుపై ముప్పేట దాడి
ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే ఇప్పటికైతే చంద్రబాబు, లోకేష్ ఇద్దరినీ కలిపి వాయించేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని పవన్ ఆరోపణలతో మరీ రెచ్చిపోతున్నారు. దాంతో పవన్ ఆరోపణలకు, విమర్శలకు సమాధానాలు చెప్పుకోలేక లోకేష్ ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిపోతోంది. ఒకవైపు జగన్, ఇంకోవైపు బిజెపి, మరోవైపు పవన్ ఇలా..చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలతో చెలరేగిపోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మొదటిసారిగా చంద్రబాబుపై ముప్పేటదాడి జరుగుతోంది.
గెలుపుపై టెన్షన్లో చంద్రబాబు
తనపై మూడు వైపులా జరుగుతున్న రాజకీయదాడులతో చంద్రబాబులో ఆందోళన పెరిగిపోయింది. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే శక్తి చంద్రబాబులో లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అసలే అనుమానం. అందుకనే చంద్రబాబు కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నట్లు స్పష్టమవుతోంది. అధికారం అందుకోవటమే చంద్రబాబు లక్ష్యమన్న సంగతి అందరికీ తెలిసిందే. అధికారం అందుకోవటం కోసం చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తారు. అందుకనే దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి మరీ కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్నారు. రేపో మాపో పొత్తుల విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా ఉంటారా ?