సరిగ్గా ఒక్క రోజు ముందు చంద్రబాబునాయుడుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈరోజు నుండి ప్రారంభించాల్సిన మదర్ కిట్ల పథకానికి బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాల ఇచ్చే వరకూ పథకాన్ని ప్రారంభించవద్దంటూ స్పష్టమైన ఆదేశాలివ్వటం చంద్రబాబుకు షాక్ కొట్టేదే. పథకం టెండర్లలో అవినీతి జరిగిందంటూ ఒక బిడ్డర్ వేసిన పిటీషన్ ను కోర్టు విచారించింది. పిటీషన్ వేసిన బిడ్డర్ వాదనతో ఏకీభవించిన కోర్టు ప్రభుత్వానికి పై విధంగా ఆదేశాలిచ్చింది.
ఇదో ఎన్నికల పథకం
ఇంతకీ విషయం ఏమిటంటే, బాలింతలకు, పిల్లలకు ఉపయోగపడేట్లుగా ఐదు వస్తువులను ఉచితంగా ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కదా చంద్రబాబుకు ఇటువంటి ఆలోచనలు చాలానే వస్తాయి. ఎందుకంటే, గడచిన నాలుగేళ్ళలో ఇటువంటి ఆలోచన ఎందుకు రాలేదో తెలీదు. సరే, కారణమేదైనా తల్లీ, పిల్లలకు ఉపయోగపడేట్లుగా కిట్లు ఇవ్వాలని అనుకున్నారు.
రూ. 50 కోట్ల కాంట్రాక్ట్
అనుకున్న పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎక్కడ చూసినా దోపిడీనే. దోపిడీకి ప్లాన్ చేసుకున్న తర్వాతే పథకాలు ప్రారంభిస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, ప్రభుత్వ లెక్కల ప్రకారం 4.5 లక్షల కిట్లను పంపిణీ చేయాలి. ఒక్కో కిట్ ఖరీదు రూ. వెయ్యి. అంటే రూ. 50 కోట్ల విలువైన కిట్లను పంపిణీకి ప్రభుత్వం సిద్దం చేయాలి. అందుకని టెండర్లను పిలిచింది.
ఎక్కువ ధర వేసిన కంపెనీకే టెండరా ?
అవినీతికి తెరలేచిందే ఇక్కడ. టెండర్లలో ఎంతమంది పాల్గొన్నా ప్రభుత్వం మాత్రం పవన్ స్కిల్క్ మిల్స్ లిమిటెడ్, అనితా టెక్స్ కోట్ అనే కంపెనీలకు కట్టబెట్టేసింది. విషయం బయటకు పొక్కగానే మా యార్న్ అండ్ ఫైబర్స్ ప్రతినిధి సురేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. అందరికన్నా తక్కువ ధర కోట్ చేసిన తనను కాదని ఎక్కువ ధర కోట్ చేసిన వా ఆరికి టెండర్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. దాంతో కోర్టు స్టే ఉత్తర్వులిచ్చింది.