ఇంత కాలం దేశాన్ని అయోమయంలోకి నెట్టేసిన జమిలి ఎన్నికల ప్రతిపాదన అటకెక్కినట్లే. ఎన్నికల ప్రధాన కమీషన్ ఓపి రావత్ చెప్పిన విషయాలతో జమిలి ఎన్నికలు సాధ్యం కాదన్న విషయం స్పష్టమైపోయింది. చాలా కాలంగా జమిలి ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠను రేపిన విషయ అందరికీ తెలిసిందే. ఏడాది చివరలోనే పార్లమెంటు, అన్నీ రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి నిర్ణయించారనే ప్రచారం బాగా జరిగింది.
రాజ్యాంగ సవరణ సాధ్యం కాదు
అయితే, తాజాగా ఓపి రావత్ చెప్పిన విషయాలతో జమిలి కుదరదని స్పష్టమైపోయింది. జమిలి ఎన్నికలకు అతిపెద్ద అవరోధం రాజ్యాంగ సవరణ చేయాలట. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటులోని అన్నీ పార్టీలూ సహకరించాల్సిందే. అది సాధ్యమయ్యే పనికాదు. అదే సమయంలో ఇవిఎంలతో పాటు సరిపడా వివి ప్యాట్లు లేవట. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే మొత్తం 24 లక్షల ఇవిఎంలు అవసరమట. అదే సంఖ్యలో వివి ప్యాట్లు కూడా కావాలి. అంత స్ధాయిలో కొనాలంటే సుమారు రూ. 4500 కోట్లు అవసరమని రావత్ తేల్చిచెప్పారు. ఇవిఎంలు, వివిప్యాట్లు సమకూర్చుకోవాలంటే కనీసం మూడేళ్ళ పడుతుందట.
ముందస్తుకు కసరత్తు
ఎన్నికల ప్రధాన కమీషనర్ నిర్ణయం తర్వాత కేంద్రం జమిలికి బదులుగా ముందస్తు ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టింది. లోక్ సభ ఎన్నికలతో పాటు మొత్తం 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యంగ సవరణ అవసరం లేదని మోడి భావిస్తున్నారు. ఈఏడాది చివరలో మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్ధాన్, మిజోరంకు ఎన్నికలు జరగాలి. వచ్చే మే నెలలో ఏపి,, తెలంగాణా, ఒడిస్సాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక, 2019 చివరలో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, 2020లో జరిగే బీహార్ ఇలా మొత్తం 11 రాష్ట్రాలకు ముందస్తు ఎన్నికలు జరిపేందుకు బిజెపి ఆలోచిస్తోంది. ఇదే విషయమై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఏమవుతుందో చూడాలి.