పాపం బుట్టా రేణుక అని అనుకుంటున్నారట తెలుగుదేశంపార్టీలో. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపిగా పోటీ చేసే అవకాశం ఫిరాయింపు ఎంపికి దాదాపు లేనట్లే అని సమాచారం. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టిడిపితో పొత్తు పెట్టుకోవటమే బుట్టా టిక్కెట్టుకు ఎసరు పెడుతోందని టిడిపిలో ప్రచారం మొదలైపోయింది. ఎక్కడో స్విచ్చేస్తే ఇంక్కెకడో బల్బు వెలిగినట్లన్నమాట. కాంగ్రెస్ తో పొత్తులు చివరకు బుట్టా కొంప ముంచటం ఖాయమనే టిడిపి నేతలంటున్నారు.
పొత్తులు దాదాపు ఖాయమన్నట్లే
పరిస్ధితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి-కాంగ్రెస్ మధ్య పొత్తులు ఖాయమన్నట్లే ఉంది. రెండు పార్టీల మధ్య పొత్తన్నాక సీట్ల షేరింగ్ తప్పదు కదా ? టిడిపి నేతల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు టిడిపి 15 అసెంబ్లీ, 2 ఎంపి సీట్లు కేటాయించే అవకాశాలున్నాయట. రెండు ఎంపి సీట్లు కూడా కర్నూలు, అరకు స్ధానాలని అంటున్నారు. కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కోసం కర్నూలు ఎంపి స్ధానాన్ని, మరో కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ కోసం విశాఖపట్నం జిల్లాలోని అరకు పార్లమెంటు స్ధానాన్ని టిడిపి కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
15 అసెంబ్లీ, 2 ఎంపిల్లో పోటీ
అడగటానికి కాంగ్రెస్ పార్టీ ఐదు ఎంపి స్ధానాలు అడుగుతున్నదని, అయితే, అన్ని స్ధానాలు చంద్రబాబు కాంగ్రెస్ ఇవ్వరని కూడా అంటున్నారు. కాబట్టి రెండు ఎంపి స్ధానాలైతే ఇవ్వక తప్పదు. కర్నూలులో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీలో ఉండటం దాదాపు ఖాయమే. అంటే పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచి తర్వాత టిడిపిలోకి ఫిరాయించిన బుట్టా రేణుక పరిస్ధితేంటి ? అంటే బహుశా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి బుట్టాకు ఎక్కడా అవకాశం దక్కకపోవచ్చు.
టిక్కెట్టు ప్రకటించిన లోకేష్
అసలు బుట్టాకు కూడా వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపిగా పోటీ చేసే ఉద్దేశ్యం లేదు. అందుకనే ఎమ్మిగనూరు ఎంఎల్ఏగా పోటీ చేసే అవకాశం ఇవ్వమని చంద్రబాబును అడిగారట. అయితే, ఎమ్మిగనూరులో టిడిపి సిట్టింగ్ ఎంఎల్ఏ బి. జయనాగేశ్వరరెడ్డి ఉన్నపుడు బుట్టాకు టిక్కెట్టు ఎలాగిస్తారు ? కాబట్టే చంద్రబాబు కూడా బుట్టాకు ఎటువంటి హామీ ఇవ్వకుండా ఎంపిగానే పోటీ చేయమన్నారు. ఈ విషయాన్నే లోకేష్ కర్నూలూలో బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
మరి బుట్టా భవిష్యత్తేంటి ?
చంద్రబాబుకు బుట్టాకు మధ్య ఇదంతా ఎప్పుడో జరిగింది. తప్పదు కాబట్టే బుట్టా కూడా ఎంపిగా పోటీ చేయటానికి సిద్ధపడ్డారు. అయితే, హటాత్తుగా మారిపోయిన రాజకీయ సమీకరణల కారణంగా టిడిపి-కాంగ్రెస్ పొత్తుల అవకాశం రోజు రోజుకు రాశీ సిమెంట్ లాగ గట్టి పడుతోంది. దాంతో కర్నూలు నుండి బుట్టాకు టిక్కెట్టు దాదాపు లేనట్లే. పోటీ చేసే అవకాశం లేనపుడు బుట్టా ఏం చేస్తారు ? ఎక్కడ ఎంఎల్ఏ టిక్కెట్టిస్తే అక్కడి నుండి పోటీ చేయాలి. లేకపోతే ఎన్నికల్లో జిల్లాలోని అభ్యర్ధులను సమన్వయం చేసుకునే బాధ్యతలు తీసుకోవాలి.