2014 ఎన్నికలలో కలిసి పోటీ చేసిన బీజేపీ టీడీపీ కూటమి ప్రస్తుతం నువ్వానేనా అన్నట్టుగా రెండు పార్టీల మధ్య వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో బిజెపి పార్టీకి సంబంధించిన నాయకులు టిడిపి పార్టీ పై తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు బీజేపీ నాయకుల పై విమర్శల దాడి చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు అందుకే రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదు అంటూ వంకలు చెబుతున్నారు టిడిపి పార్టీకి సంబంధించిన నాయకులు.
ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టిడిపి అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులతో రాజధానికి ఒక్క పనికి కూడా శంకుస్థాపన చేయలేదన్న ఆయన… ఇప్పటివరకు అమరావతి నిర్మాణానికి సంబంధించి మాస్టర్ప్లాన్ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.
రాజధాని నిర్మాణం కోసం బాండ్ల జారీ ద్వారా సేకరించిన రెండువేల కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలన్న ఆయన.. మాస్టర్ ప్లాన్ ఏమైనా బీరువాలో దాచారా? అని ప్రశ్నించారు. బాబు ముమ్మాటికీ ఆంధ్రా ద్రోహి అని.. పచ్చి అవకాశవాది అని.. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్తో దోస్తీ కడుతున్నారన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి కారణం ప్రధాని మోడీనేనన్న కన్నా.. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయికూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కేవలం తమ రాజకీయ లబ్దికోసం గ్రామాల్లో ఉన్న అమాయకుల ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మోసం చేస్తున్నారని పేర్కొన్నారు కన్నా లక్ష్మీనారాయణ.