మనేడేగా వదిలేయ్! అన్నట్టుగా ఉంది ఏపీ పాలన! ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. మనోడైతే.. ఒక న్యాయం.. అప్పోజిషనైతే.. మరో న్యాయం అనే రేంజ్లో సాగుతున్నాయి పాలిటిక్స్! తాజాగా సీమ జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల తాలూకు కుటుంబ సభ్యలు వ్యవహారం రాజకీయంగా మారింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు విపక్షం వైసీపీకి చెందిన వారు కాగా, మరొకరు అధికార పక్షం టీడీపీకి చెందిన వారు కావడం గమనార్హం. దీంతో చర్చ జోరుగా సాగుతోంది. విషయంలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సతీమణి.. లక్ష్మి వెలుగు ఉద్యోగుల ఖాతాలో నిధులు జమచేసినట్టు తేలింది.
ఒక్కొక్క ఖాతాకు రూ.2000 చొప్పున ఆమె వంద మందికిపైగా మహిళల ఖాతాలో రూ.3.5 లక్షలు జమ చేశారని స్పష్టమైంది. అయితే, ఈ విషయం తెలిసిన వెంటనే దీనికి వెంటనే ఎన్నికల రాజకీయాలను అంటగడుతూ.. అధికార పార్టీకి చెందిన నాయకులు కామెంట్లు కుమ్మరించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు, మహిళలను ప్రలోభాలకు గురి చేసేందుకు ఇలా ఆమె వ్యవహరించారని కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన లక్ష్మి.. తన వివరణ తాను ఇచ్చుకున్నారు. వెలుగు సిబ్బంది ఓ 20 రోజుల కిందట తన వద్దకు వచ్చారని, వారి సమస్యలు చెప్పుకొన్నారని, పూట గడవడం కూడా కష్టం గా మారడంతో ఇబ్బందులు పడుతున్నామని కన్నీరు పెట్టుకున్నారని అందుకే వేశానని చెప్పుకొన్నారు.
అయితే, ప్రభుత్వం మాత్రం దీనిని సీరియస్గా తీసుకుంది. విచారణకు ఏసీబీని ఆదేశించాలని ఇప్పటికే తెరచాటు మంత్రాంగం కూడా నడిచిపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కడప జిల్లా రాజంపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేడా మల్లిఖార్జున రెడ్డి తండ్రి, తిరుమల,తిరుపతి ట్రస్టుబోర్డు సభ్యుడు అయిన రామకృష్ణారెడ్డి కారు నుంచి ఏభై లక్షల రూపాయల చోరి జరిగింది.ఆయన కారు డ్రైవరే వాటిని అపరహించుకు పోయాడని వార్తలు వచ్చాయి. కర్నూలులో ఒక హోటల్ వద్ద భోజనానికి ఆగినప్పుడు డ్రైవర్ కు ఏభై లక్షల నగదు అప్పగించి వెళ్లాడట. తిరిగి వచ్చేసరికి కారులో ఉన్న సొమ్ముతో డ్రైవర్ మల్లికార్జున పరారయ్యాడు.
అయితే అంత పెద్ద మొత్తం నగదును రామకృష్ణారెడ్డి ఎందుకు తీసుకువెళుతున్నాడన్నది అసలు ప్రశ్న. ఇది పన్ను ఎగవేత సొమ్మా? లేక ఏదైనా ప్రలోభాలకు సంబంధించిన సొమ్మా? అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే, దీనిని లైట్గా తీసుకోవాలని ఇప్పటికే అధికార నేతల నుంచి వివిధ శాఖలకు ఉత్తర్వులు అందాయి. అంటే.. మూడున్నర లక్షల విషయంలో ఒకలాగా.. 50 లక్షల విషయంలో మరోలాగా వ్యవహరించాలనేది చంద్రబాబు వ్యూహం. ఇప్పుడు ఇదే అంశాన్ని చెవిరెడ్డి బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. మరి ఇది రాబోయే రోజుల్లో పెద్ద రగడకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.