నిజమే! వైసీపీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి రాజకీయ గ్రాఫ్ అమాంతం తగ్గిందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని పార్టీలోని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి మేధావులు సైతం అంగీకరించారు. మరో ఆరేడు మాసాల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇలా గ్రాఫ్ డౌన్ కావడంపై పార్టీ యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టిందని చెబుతున్నారు. తాజా పరిణామాలను చూస్తే.. ప్రజల్లోపార్టీని మరింత విస్తృతంగా తీసుకు వెళ్లాలని, వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని, రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపించాలని జగన్ ఎన్నో ఆశలు పెట్టుకు న్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఆయనకు అధికారం అవసరం కూడా!
అటు పార్టీ పరంగా చూసినా.. ఇటు వ్యక్తిగతంగా చూసినా.. జగన్ ఎన్నికల్లో గెలవాల్సిన పరిస్తితి ఉంది. ఈ క్రమంలోనే ఆయన ఎంతో గొప్పగా ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు 10 నెల్లుగా ఈ పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుకు అత్యంత బలమైన జిల్లాగా ఉన్న చిత్తూరు, అనంతపురంలో సైతం ఈ పాదయాత్ర కు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అదేవిధంగా పలు జిల్లాల్లో నాయకులు కూడా జగన్ కు జైకొట్టారు. టీడీపీ నుంచి కూడా వసంత నాగేశ్వరరావు వంటి దిగ్గజ కుటుంబాల వలసలు వచ్చి చేరాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహం బాగానే అమలు చేస్తున్నారంటూ.. జగన్కు అన్ని వైపుల నుంచి మద్దతు లభించింది.
అయితే, అనూహ్యంగా ఆయన పొలిటికల్ గ్రాఫ్ డౌన్ అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జనసేన అధినేత పవన్పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు, కాపుల రిజర్వేషన్పై చేసిన వ్యాఖ్యలు ఆయన కొంప ముంచాయి. ఇక, జగన్ సతీమణి భారతిపై ఈడీ కేసు నమోదు చేసిందంటూ ప్రభుత్వ అనుకూల మీడియాలో జరిగిన ప్రచారం కూడా ఆయనకు మైనస్గా మారింది. దీంతో జగన్ గ్రాఫ్ పడిపోయిందని అంటున్నారు. మరోపక్క, ఎన్నికల సమయానికి ప్రజలకు ఇచ్చేందుకు కొత్తగా ఎలాంటి హామీలు లేకపోవడం జగన్కు మరింత కలిసిరాని కాలాన్ని చేరువ చేసింది. ఇప్పటికే ఆయన నవరత్నాలు.. రీయింబర్స్మెంట్ వంటి హామీలు, పింఛన్ల పెంపు, చేనేతలకు 45 ఏళ్లకే పింఛన్లు వంటి వాగ్దానాలు చేసేశారు.
కొత్తగా చేయాల్సిన హామీలు ఇప్పుడు ఆయనకు ఎక్కడా కనిపించడం లేదు. అయితే, అదేసమయంలో అటు అధికార పార్టీ, ఇటు మరో పార్టీ జనసేన అధినేతలు సరికొత్త వాగ్దానాలతో ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలు జగన్కు ఒకింత ఇబ్బంది కలిగించేవేనని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రాఫ్ డౌన్ అయిందని గుర్తించిన పార్టీలోని హైపర్ కమిటీ.. ఆయా అంశాలను చర్చించి.. నూతన పథకాలకు నాంది పలకాలని, కొత్త హామీలపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు తాజాగా లోటస్ పాండ్ వర్గాలు పేర్కొంటున్నాయి.