కొంతకాలం పాటు ఏదో ఒక డివిజన్ కు కార్పొరేటర్ గానో లేకపోతే మున్సిపాలిటిక ఛైర్మన్ గానో పనిచేసిన వాళ్ళు కూడా లక్షల రూపాయలు వెనకేసుకుంటున్న రోజులివి. ఇక ఒకసారి ఎంఎల్ఏగా పనిచేస్తే సదరు ఎంఎల్ఏ సంపాదన గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇది, ప్రస్తుత రాజకీయాల్లో నడుస్తున్న నయా ట్రెండ్. అటువంటిది దశాబ్దాల పాటు ఎంపిగా పనిచేసి, తర్వాత కేంద్రమంత్రై ఆ తర్వాత మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వాజ్ పేయికి సొంత ఇల్లు కూడా లేదంటే ఎవరైనా నమ్ముతారా ? రాజకీయాల్లోనే కాకుండా వ్యక్తిత్వంలో కూడా మహోన్నతుడని పించుకున్న వాజ్ పేయి నిజమైన భారతరత్నం కాదని ఎవరైనా అనగలరా ?
సుదీర్ఘ రాజకీయ అనుభవం
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో పుట్టి పెరిగిన వాజ్ పేయి చిన్న తనంలోనే రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యారు. జన్ సంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీకి చేసిన సేవలు ఎవరు మరువగలరు ? భారతీయ జనతా పార్టీని జాతీయ స్ధాయిలో పటిష్టానికి చేసిన కృషిని ఎవరు మరువగలరు ? పార్లమెంటులో బిజెపికి 2 సీట్ల నుండి సంపూర్ణ అధికారంలోకి వచ్చేందుకు దేశవ్యాప్తంగా తిరిగి పార్టీని పటిష్టపరిచేందుకు చేసిన పర్యటనలను ఎవరూ మరువలేరు.
మహోన్నత వ్యక్తిత్వం
వైరుధ్యాలు పార్టీల మధ్యేకానీ వ్యక్తుల మధ్య కాదని, పార్టీలు వేరు, వ్యక్తగత సంబంధాలు వేరని చాటి చెప్పిన నాటి మహోన్నత నేతల్లో వాజ్ పేయి కూడా ఒకరు. పార్టీలు, సిద్ధాంతాల పరంగా ప్రత్యర్ధులను ఎంతగా విమర్శించేవారో నేతలుగా, వ్యక్తులుగా ఎదుటి పార్టీలో వారిని అంతే స్ధాయిలో గౌరవించేవారు. అందుకే వాజ్ పేయి వ్యక్తిత్వాన్ని మాజీ ప్రధానమంత్రులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరా గాంధి, పివి నరసింహారావు లాంటి ఎందరో అమితంగా ఇష్టపడేవారు.
ఓటు తగ్గితే రాజీనామ చేసిన వాజ్ పేయి
పదవులు నిలుపుకోవటం కన్నా వ్యక్తిత్వాన్ని కాపుడుకోవటమే ముఖ్యమని నమ్మిన నేతల్లో వాజ్ పేయి కూడా ఒకరు. అందుకనే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నెగ్గటానికి ఒక్క ఓటు అవసరమైన సమయంలో కూడా ఎవరినీ ఒక్క ఓటు కోసం పాకులాడలేదు. చివరకు ఆ ఒక్క ఓటు వల్లే మొదటిసారి ప్రధానిగా దిగిపోవాల్సొచ్చినా ఏమాత్రం బాధపడలేదు. అదే వాజ్ పేయి వ్యక్తిత్వానికి నిదర్శనం. ఒక్క ఓటు తగ్గితే రాజీనామా చేసిన వాజ్ పేయితో పదవులు కాపాడుకోవటం కోసం అడ్డమైన గడ్డి తింటున్న ఇప్పటి నేతలను పోల్చి చూడటం భారతరత్నను కించపరచటమే అవుతుంది.
ఇప్పటి నేతలెందుకు ఆచరించటం లేదు ?
పార్టీలకతీతంగా ఇప్పటి నేతలు వాజ్ పేయి సేవలను, వ్యక్తిత్వాన్ని ఆకాశమంత పొగుడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. వాజ్ పేయి వ్యక్తిత్వం నిజంగానే అందరికీ అంతగా ఆదర్శమైతే మరి ఇప్పటి నేతలు ఎందుకు ఆ ఆదర్శాలను పాటించటం లేదు ? ప్రతిపక్షాల నేతల సంగతిని పక్కనపెడదాం. ప్రధానమంత్రి నరేంద్రమోడితో మొదలుపెట్టి బిజెపి నేతలైనా వాజ్ పేయి ఆదర్శాలను ఎందుకు ఆచరించటం లేదు ? వాజ్ పేయి ఆదర్శాల గురించి చెప్పిన మాటలు చెప్పకుండా చెబుతూనే ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇప్పటి నేతలు నిజంగానే సిగ్గుపడాలి.