సీనియర్ నేత కందుల దుర్గేష్ తూర్పు గోదావరి జిల్లాలో త్వరలో వైసిపికి షాక్ ఇవ్వనున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున టిక్కెట్టు రాదని ఖాయమైపోవటంతోనే వైసిపిని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసేసి జనసేనలో చేరి అక్కడి నుండి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారట.
అన్నీ గాలివాటు యాత్రలే
జిల్లాలో ఒకవైపు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తికాగానే ఇంకోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన మొదలుపెట్టారు. పార్టీ బలోపేతానికి పవన్ ఇప్పటి వరకూ చేస్తున్న ప్రయత్నాలంటూ కనబడటంలేదు. ఏదో గాలివాటుగా యాత్రలు చేసుకుంటూ, ఇటు జగన్ అటు చంద్రబాబునాయుడుపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారంతే. కాకపోతే టిడిపి, వైసిపిల నుండి ఎవరైనా నేతలు బయటకు వచ్చి జనసేనలో చేరుతానంటే వారికి పార్టీ కండువా కప్పుతున్నారు. త్వరలో కందుల దుర్గేష్ విషయంలో కూడా అదే జరగబోతోందట.
పవన్ పై వ్యాఖ్యలు కూడా కారణమేనా ?
పాదయాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై జగన్ చేసిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జగన్ వ్యాఖ్యలపై మొదట్లో కాపు సామాజికవర్గంలోని కొందరి నుండి వ్యతిరేకత కనబడినా ఆ తర్వాత ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి వరకూ పవన్ ను జగన్ పెద్దగా పట్టించుకోలేదు. పెద్దాపురంలో జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా వ్యూహాత్మకంగా చేసినవే అని కొందరు వైసిపి నేతలంటున్నారు. మరి దాని వల్ల వైసిపికి ఎంత మేరకు లాభం జరుగుతుందో చూడాల్సిందే. కాకపోతే వైసిపిని వదిలేయాలని అనుకున్న నేతలకు జగన్ వ్యాఖ్యలు ఒక సాకులాగ ఉపయోగపడతాయంతే.
టికెట్టే ప్రధాన సమస్యా ?
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి కందులకు అవకాశం లేకపోవటమే ప్రధాన సమస్య అని తెలిసిందే. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని దుర్గేష్ అనుకున్నారు. అయితే, పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన వీర్రాజుకే మళ్ళీ టిక్కెట్టు దక్కే అవకాశాలున్నాయట. దాంతో కందుల పోటీ చేయాలంటే నియోజకవర్గం లేదు. కేవలం పోటీ చేసే ఉద్దేశ్యంతోనే కందుల వైసిపి నుండి జనసేనలోకి మారాలని నిర్ణయించుకున్నారట. ఆ విషయం చెబితే బాగోదనే ఇంకేవో కథలు చెబుతున్నారని వైసిపి వర్గాలంటున్నాయి.