వర్తమాన రాజకీయాలలో ఎన్ని నీతులు చెప్పినప్పటికీ తర, తమ భేదాలు పాలకులు పాటిస్తూనే ఉన్నారు. తమ వైపు ఉన్నంత వరకూ ఎన్ని పాపాలు చేసినా ఓకే. అదే పార్టీని వీడి బయటకు వెళ్ళా ఇక అసలైన కష్టాలు మొదలవుతాయి. చుక్కలు చూపించి లెక్కలు సరి చేస్తారు. ఇపుడు విశాఖ జిల్లాలో అచ్చంగా జరుగుతున్నది అదే.
డీసీసీబీ గడువు పొడిగించలేదు:
విశాఖ జిల్లా సహకార బ్యాంక్ గడువు తీరిన తరువాత అప్పట్లో ఓ విడత పొడిగించారు. దానికి ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు కొడుకు సుకుమార వర్మ అధ్యక్షుడు. తండ్రీ కొడుకులిద్దరూ టీడీపీలో ఉన్నపుడు అలా చేశారు. రీసెంట్ గా ఈ ఇద్దరూ వైసీపీలో చేరిపోయారు. పైగా జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాలో సాగుతోంది. దాంతో అదను చూసి మరీ వేటు వేశారు. ఏపీలో అన్ని డీసీసీబీలకు ఆరు నెలల పాటు గడువు పెంచిన బాబు ప్రభుత్వం విశాఖ డీసీసీబీకి మాత్రం పర్సన్ ఇంచార్జ్ గా కలెక్టర్ ని నియమించింది. అలా వర్మకు దెబ్బ కొట్టేసింది.
పాత కేసులతో హడావుడి :
ఇక మరో వైపు మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మీద ఏడెనిదేళ్ళ క్రితం ఉన్న పాత కేసులను ఇపుడు అర్జంట్ గా టీడీపీ తిరగతోడుతోంది. కాంగ్రెస్ హయాంలో పెట్టిన కేసులు టీడీపీలో ఉన్నంత సేపూ గుర్తుకు రాలేదు. ఇపుడు వైసీపీలోకి రాగానే వేధింపులు స్టార్ట్ చేసేశారు. దాంతో ఈ మధ్యకాలమంతా కన్నబాబు రాజు సీక్రెట్ శిబిరంలోకి వెళ్ళిపోవాల్సివచ్చింది.
ఇలా ఏక కాలంలో తండ్రీ కొడుకుల మీద టీడీపీ ప్రతాపం చూపిస్తూండడం విశేషం. ఇదంతా రాజకీయ కక్ష సాధింపులేనని కన్నబాబు రాజు మీడియా ముందు వాపోయారు. తాను డీసీసీబీని లాభాల బాటలో పెడితే తనకు ఇచ్చిన బహుమానం ఇదంటూ సుకుమార్ వర్మ ఆవేదన చెందుతున్నారు మొత్తానికి టీడీపీ మార్క్ ప్రజాస్వామ్యం బాగానే అమలు చేస్తున్నారు.