ఆనవాయితీకి ఫుల్ స్టాప్ పెట్టి చంద్రబాబునాయుడు కొత్త ట్రెండ్ తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఉన్నారట. ఇంతకీ ఏ విషయంలో అంటే అభ్యర్ధుల ప్రకటనలోనట. ఎన్నికలకు ఇంకా పది మాసాల సమయం ఉన్నట్లే ముందుగా కనీసం కొందరికైనా టిక్కెట్లను ప్రకటించాలని నిర్ణయించుకున్నారట. తక్కువలో తక్కువ ఓ 30 మంది అభ్యర్ధులకు టిక్కెట్లను ప్రకటించాలని చంద్రబాబు దాదాపు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
ఆనవాయితీగా భిన్నంగానా ?
మామూలుగా అయితే టిడిపిలో ముందుగా టిక్కెట్లు ప్రకటించే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఫలానా నియోజకవర్గంలో అభ్యర్ధి లేకపోతే సిట్టింగ్ ఎంఎల్ఏకే టిక్కెట్టు ఖాయమని అందరికీ తెలిసినా చంద్రబాబు మాత్రం టిక్కెట్టు ప్రకటించరు. ప్రతీ విషయాన్ని నాన్చి నాన్చి అందరికీ విసుగు తెప్పించి మరి కొద్ది గంటల్లో నామినేషన్లకు గడువు ముగిసేముందు అప్పుడు టిక్కెట్టు ప్రకటిస్తారు. ఇదంతా టిడిపి నేతలకు అలవాటైపోయింది.
గెలుపు భయంతోను ప్రయోగమా ?
అటువంటిది వచ్చే ఎన్నికలకు మాత్రం ఆనవాయితీని పక్కనపెట్టాలని చంద్రబాబు అనుకోవటానికి కారణం ఏమైఉంటుంది ? అంటే, గెలుపు భయమనే చెప్పాలి. ఒకవైపు తన పాలనపై జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకత. ఇంకోవైపు టిడిపిలోని పలువురు ఎంఎల్ఏలు, నేతలపై వినబడతున్న అవినీతి ఆరోపణలు, చేయించుకుంటున్న సర్వేల్లో కనిపిస్తున్న ప్రతికూలత ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని కనీసం కొందరి అభ్యర్ధిత్వాలనైనా ముందుగా ప్రకటిస్తే నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందేమోనని ఆశతో ఉన్నారట.
ఇంతకీ ఏ నియోజకవర్గాల్లో ?
వైసిపి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గల్లో అభ్యర్ధుల ముందస్తు ప్రకటనపై చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారట. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున 67 మంది ఎంఎల్ఏలు గెలిచినా వారిలో 22 మందిని చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్నారు. మరి ముందుగా లాక్కున్న 22 మంది ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకరవర్గాలపై కసరత్తు మొదలుపెట్టారా ? లేకపోతే వైసిపిలో మిగిలిన 45 మంది ఎంఎల్ఏల నియోజకవర్గాలపై కసరత్తు మొదలుపెట్టారా అన్న విషయంలో స్పష్టత లేదు.
మదనపల్లే ఉదాహరణ !
అభ్యర్ధులను ముందుగా ప్రకటించాలని అనుకుంటున్న కొన్ని నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు ఇప్పటికే చర్చలు మొదలుపెట్టారు. నేతల మధ్య ఏకాభిప్రాయం వస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక దాదాపు పూర్తి చేస్తున్నట్లే. ఉదాహరణకు మదనపల్లి నియోజకవర్గాన్నే తీసుకోవచ్చు. అక్కడ టిక్కెట్టు కోసం మాజీ ఎంఎల్ఏ దమ్మాలపాటి రమేష్, సీనియర్ నేతలు రాందాస్, రామకృష్ణ పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా మిగిలిన ఇద్దరూ పనిచేసేట్లు ఒప్పందం చేసుకున్నారట. అదే విషయాన్ని చంద్రబాబు తో కూడా చెప్పారట. అంటే ఈ నియోజకవర్గంటో టిక్కెట్టు ప్రకటించేందుకు రంగం సిద్ధమైనట్లే. ఇటువంటి నియోజకవర్గాలను మరికన్నింటిని గుర్తించి వీలైనంత తొందరలో టిక్కెట్లను ప్రకటించాలని నిర్ణయించారు. మరి, చంద్రబాబు ప్రయోగం ఎంత వరకూ సఫలమవుతుందో చూడాల్సిందే ?