భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి ఏపీ ప్రభుత్వం విరాళం ప్రకటించింది. కేరళ ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు రూ.10 కోట్ల సాయం ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దాదాపు పది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. ఆగస్టు 8 నుంచి ఇప్పటిదాకా వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 97కు చేరుకుంది. పొరుగు రాష్ట్రం కేరళలోని వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5కోట్ల సహాయాన్ని ప్రకటించింది.
ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అంతే కాదు, ప్రజలను కూడా, తోచినంత సహాయం చేసి, కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవల్సిందిగా కోరారు. వస్తు రూపేణా, ఇంకా ఇతరత్రా సాయం అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేరళలో పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది. గురువారం సైతం భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. 14 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. సుమారు 1.67 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరికోసం కేరళ వ్యాప్తంగా 1,165 సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటుచేశారు.
కోచితోపాటు కేరళలోని అనేక ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కోచి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 26 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా, కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. కేరళ సీఎం సహాయనిధికి తమ ప్రభుత్వం తరపున రూ.10 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.