మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య కన్ను మూశారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన గోపరాజు రామచంద్రరావు కూతురు విద్య. విజయనగరంలో 1934 జూన్ 5న జన్మించిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. చెన్నుపాటి శేషగిరి రావును 1950లో వివాహం చేసుకున్నారు.
1974లోనే ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. అయితే దరఖాస్తులో కులం, మతం అనే కాలమ్ను ఖాళీగా వదిలివేయడంతో కాంగ్రెస్ నుంచి టికెట్ ఖరారు కాలేదు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. కులం, మతం అవసరం లేని రోజున తనను పిలవాలని నేరుగా ఇందిరాగాంధీకి లేఖ రాశారు.
దాంతో ఇందిరాగాంధీ 1979లో తొలిసారి పార్లమెంట్ ఎన్నికల కోసం విజయవాడ టిక్కెట్ను విద్యకు కేటాయించారు. 1980 నుంచి 1984 వరకు మొదటిసారి, 1989 నుంచి 1991 వరకు రెండోసారి లోక్సభ ఎంపీగా తన బాధ్యతలను నిర్వర్తించారు విద్య. వాసవ్య మహిళా మండలి ద్వారా మహిళా సంక్షేమం, అభ్యుదయానికి ఎంతో కృషి చేశారు.
విద్యకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ తరఫున విజయవాడ పార్లమెంట్ నుంచి విద్య రెండు సార్లు లోక్సభ ఎంపీగా గెలిచారు. అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎదురు లేని మహిళా నాయకురాలిగా, విజయవాడ ఎంపీగా ఎదగడం ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. విద్య అంత్యక్రియలు సోమవారం విజయవాడలో జరుగుతాయని బంధువులు వెల్లడించారు.