ఆ మద్య విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో అమ్మవారికి సమర్పించిన చీర దొంగిలించిన కేసు రచ్చగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతను ప్రభుత్వం గతంలో బాధ్యతల నుంచి తప్పించింది. తాజాగా బెజవాడ కనకదుర్గ గుడి ట్రస్టుబోర్డు మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు. గుడిలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని బోర్డు చైర్మన్ ద్రుష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని చెప్పారు. గుడిలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించినందుకు.. నాపై కక్షపూరితంగానే పదవి నుండి తొలగించారని ఆరోపించారు.
దుర్గగుడిలో ఓపీడిఎస్కు చెందిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. పాలక మండలి సభ్యులు వెలగపూడి శంకరబాబు గుడిలో పనిచేసే మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారని.. శంకరబాబుకు పాలకమండలి చైర్మన్ గౌరంబాబు అండగా నిలుస్తున్నారని సూర్యలత అన్నారు. అమ్మవారి చీరలకు సంబంధించి చాలా అక్రమాలు జరిగాయనీ, వాటిని ప్రశ్నించినందుకు తనపైనే చీర దొంగిలించినట్లు అభాండాలు వేశారని ఆమె వాపోయారు.
ఆలయ అభివృద్ది పనుల్లో భాగంగా సీసీ రోడ్, ఘాట్రోడ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. చైర్మన్ అక్రమాలను వ్యతిరేకించినందుకే తనపై కక్ష్య కట్టారని పేర్కొన్నారు. అమ్మవారి సొమ్మును స్వాహా చేస్తున్న ఉన్నతాధికారులు, సిబ్బంది వైఫల్యాలను బయట పెట్టానన్న సూర్యలత... అన్నదానం, చీరలు, కేశకండన విభాగాల్లో భారీ అవినీతిని అరికట్టాలనడం తప్పా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే తనను తొలిగించారని, తాను ఏ తప్పు చేయలేదని సూర్యలత స్పష్టంచేశారు.