జనసేన అధినేత... పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైందా? ఆయన పార్టీలోకి జంప్ చేసేందుకు నాయకు లు సిద్ధంగా ఉన్నారా? కేవలం పవన్ పిలుపు కోసమే వారు ఎదురు చూస్తున్నారా? అంటే.,. తాజా పరిణామాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న పవన్ గత మూడు మాసాలుగా ఒకింత యాక్టివ్ అయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రారంభించిన పోరు యాత్ర.. ఇప్పుడు పశ్చిమ గోదావరిలో సాగుతోంది. ఇక, ఈ క్రమంలోనే ఆయన అన్ని వర్గాలను సానుకూలంగా మలుచుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సామాజిక సమీకరణలకు తెరచాటుగా ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారానికి తాను దూరమని గతంలో ప్రకటించడంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది.
అప్పటి వరకు పవన్ పార్టీలోకి వెళ్లాలని చూసిన తటస్థులు చాలా మంది మౌనం వహించారు. దీంతో ఈ ప్రకటన.. పెద్ద తప్పని తెలుసుకున్న తెలుసుకున్న పవన్.. ఇప్పుడు అధికారం కోసం పాకులాడుతున్నారనే విషయం స్పష్టమవు తోంది. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల జరిగిన భీమవరం సభలో స్పష్టం చేశారు. ప్రజలు తనను ఆశీర్వదిస్తే.. సీఎం అయ్యేందుకు తాను రెడీ అని అంటూనే ఎన్నికల హామీలను కూడా కుమ్మరించారు. ఈ క్రమంలోనే ఆయన మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గ్యాస్ ఫ్రీ అంటూ చేసిన పవన్ హామీకి మహిళలు ఫిదా అయ్యారు. దీంతో పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది.
ఈ క్రమంలోనే పలు పార్టీలకు చెందిన నాయకులు ఇప్పుడు జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదేవిధంగా కాపుల విషయంలోనూ పవన్ సానుకూల ప్రకటనే చేయడం ద్వారా ఆ వర్గం వారిని కూడా ఆకర్షించాడు. దీంతో ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ రాజకీయాల్లో పవన్ ఎఫెక్ట్ కనిపిస్తోందని అంటున్నారు. వాస్తవా నికి ఉభయ గోదావరుల్లోనూ రాజకీయంగా యువత పవన్ వెంటే నడుస్తోంది. ఇక, ఇప్పుడు టీడీపీ, వైసీపీల నుంచి కూడా కీలక నాయకులు తమకు టికెట్ ఇవ్వకపోతే.. అంటూ.. ఆయా పార్టీల అధినేతలకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్లు రావని భావిస్తున్నవారు కూడా పవన్ వెంట నడిచేందుకు రెడీ అవుతున్నారు. ఈ జాబితాలో టీడీపీ నాయకులే ఎక్కువగా ఉండడం గమనార్హం. మరి టీడీపీ అధినేత చంద్రబాబుకానీ, వైసీపీ అధినేత జగన్ కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.