నెల్లూరులో పాగా వేసేందుకు అధికార టీడీపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. ఇక్కడ గత ఎన్నికల్లో మూడు స్థానాలకే పార్టీ పరిమితమైంది. మిగిలిన స్థానాల్లో వైసీపీ పాగా వేసింది. దీంతో వైసీపీకి బలంగా ఉన్న నియోజకవర్గాలను వచ్చే ఎన్నికల నాటికి తన వైపు తిప్పుకొనేందుకు చంద్రబాబు వ్యూహాత్మంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే భాగంగా గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన ప్రతి నియోజకవర్గం పరిస్థితిని చంద్రబాబు కూలంకషంగా తెలుసుకుంటున్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పి నారాయణలకు ఈ జిల్లాలో అత్యధిక సీట్లు తెచ్చుకునే బాధ్యతను అప్పగించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
గత ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే సాధించిన టీడీపీ ఈసారి కనీసం ఆరు స్థానాలలోనైనా గెలవాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి టీడీపీకి ఆదరణ ఉన్నా సరైన నాయకత్వం లేక పార్టీ ఇబ్బందులు పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఇప్పటి నుంచే సరైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను చంద్రబాబు చేపట్టారు. అయితే, ఇప్పటికే పలు కీలక నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. వీరిపై ఎవరిని దించినా గెలుపు కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది., ఈ నేపథ్యంలో నేరుగా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలను సైతం రంగంలోకి దింపాలని నిర్ణయించారు. బీసీలకు మరిన్ని తాయిలాలు ప్రకటించాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు.
ఇక, గత ఎన్నికల్లో ఎంపీ సీటుకు పోటీ చేసి ఓడిపోయిన ఆదాల ప్రభాకర్రెడ్డిని ఈ దఫా అసెంబ్లీకి పంపి, బీసీల్లో మంచి పట్టున్న నాయకుడు బీద మస్తాన్రావును ఎంపీ సీటుకు నిర్ణయించారని కూడా సమాచారం. ఇక, జిల్లాలో యువ నాయకతత్వానికి పెద్దపీట వేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. వైసీపీ నుంచి జంప్ చేసే వారికి ఎవరికైనా తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలక స్థానం దక్కుతుందనే ప్రచారం కూడా లోపాయికారీగా చేస్తున్నారు.
ఇక, స్తానిక యువతను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుని, వారికి నిరుద్యోగ భృతి కల్పించి.. అయినా సరే పార్టీకి అనుకూలంగా పనిచేయించు కోవాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. ఇక నెల్లూరు ఎంపీ సీటును టీడీపీ గత నాలుగు ఎన్నికల్లోనూ కోల్పోతోంది. ఇప్పుడు కూడా ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. ఈ ఈక్రమంలోనే మరి బాబు వేసిన బీసీ కార్డుతో ఈ సారి అయినా ఇక్కడ టీడీపీ గెలుపు గుర్రం అవుతుందో ? లేదో ? చూడాలి.