కేరళ వరద బాధితులకు వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల కేరళ రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగిందో అందరూ చూస్తున్నదే. ఇప్పటికే సుమారు 500 మందికి పైగా అధికారికంగానే ప్రాణాలు కోల్పోయారు. వివిధ రూపాల్లో జరిగిన ఆస్తినష్టమైతే ఇప్పటికి లెక్కలు కట్టింది సుమారుగా రూ. 20 వేల కోట్లు. చిగురుటాకుల వణికి పోతున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు అందరూ ఎవరికి తోచినట్లుగా వాళ్లు సాయం ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే జగన్ కూడా కోటి రూపాయల విరాళం ప్రకటించారు.
ఏపి ప్రభుత్వం విరాళం
మూడు రోజుల క్రితమే చంద్రబాబునాయుడు కూడా రూ. 5 కోట్లు సాయం ప్రకటించారు. కానీ అది ప్రభుత్వం తరపున అన్న విషయం గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఇంత వరకూ సాయంపై చంద్రబాబు నోరెత్తలేదు. ఇక సినీ హీరోలు పలువురు కూడా బాగానే స్పందించారు. ఇటువంటి నేపధ్యంలోనే ఆలస్యంగానే అయినా జగన్ విరాళం ప్రకటించటం మంచిదే. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి తన విరాళాన్ని అందచేయనున్నట్లు వైసిపి అధికార ప్రతినిధి బొత్సా సత్యనారాయణ ప్రకటించారు.
ప్రతీ ఒక్కరూ ఆదుకోవాల్సిందే
జగన్ ప్రకటించిన విరాళం పార్టీ తరపున అధ్యక్షునిగానా లేకపోతే వ్యక్తిగతంగానా అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. సరే, ఎలా ఇచ్చినా కోటి రూపాయల విరాళమంటే చిన్న మొత్తం కాదు కదా ? ప్రతీ ఒక్కరూ ఎవరికి తోచినంతలో వారు సాయం చేయకపోతే ఇటువంటి ప్రకృతి విలయాలను ఎదుర్కోవటం సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే.