ముస్లిములు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది ఈదుల్. జుహ మనిషి త్యాగనిరతి గురించి తెలియజేసే పండుగ. అందుకే దీన్ని త్యాగాల పండుగని, ఈదుల్ అజహా, ఈదుజ్జహ లేక బక్రీద్ అని అంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హేజ్, 10న బక్రీద్ పండుగను ముస్లిములు జరుపుకుంటారు.
రంజాన్లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గాలో సామూహిక ప్రార్థనలు జరుపుతారు.
ఆతర్వాత వారు నెమరు వేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ఈ ఖుర్బాని చనిపోయిన తర్వాత సిరాత్ వంతెన దాటడానికి ఉపయోగపడుతుందని ఇస్లాం హదీసుల ద్వారా తెలుస్తుంది.
ఈ హదీసులు అంటే మహమ్మదు ప్రవక్త యొక్క ప్రవచనాలు , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాలు. ఈ హదీసులు, సున్నహ్ మరియు ముస్లింల జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలుగా భావిస్తారు.సనద్ మరియు మతన్ లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం.