బాబోయ్.. ఇదేం అమ్ముడు.. ఇదేం తాగుడు..! లెక్కలు చూస్తే.. దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తది..! జనం ఇల్లును.. ఒళ్లునూ తెలంగాణ సర్కార్ ఎలా గుల్ల చేస్తోందో తెలిస్తే.. కళ్లు తిరిగిపోతయ్..! మద్యం అమ్ముతూ.. ఆదాయాన్ని ఎలా కుమ్ముతుందో ఈ ఆరు నెలల రాబడిని చూస్తే.. అర్థమవుతుంది.. తెలంగాణ ధనిక రాష్ట్రం అని పదేపదే సీఎం కేసీఆర్ అంటుంటే..ఏమో అనుకున్నాంగానీ.. ఆయన మాటల్లో ఇంత గమ్మత్తు ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు.. ఆయన పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత పెగ్గుల దందాకు పట్టపగ్గాలు లేకుండా పోయిందనడానికి.. కేవలం ఈ ఆరు నెలల్లోనే తెలంగాణ ఆబ్కారీ శాఖకు అందిన ఆదాయమే నిదర్శనమని పలువురు అంటున్నారు.
ఓవైపు మద్య నిషేధం కోసం మహిళలు, పలు సంస్థలు డిమాండ్ చేస్తుంటే.. మందుబాబుల డిమాండ్కు మించి మద్యం సరఫరా చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. అందుకే పెద్దవాళ్లే కాదు.. ఇంటర్ విద్యార్థులూ పెగ్గుల ముగ్గులో మునిగితేలుతున్నారు. క్లాస్మేట్స్ ఏమోగానీ.. గ్లాస్మేట్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఎక్కడబడితే అక్కడ.. ఎక్కడికక్కడ.. అడ్డదిడ్డంగా వైన్స్షాపులకు, బార్లు దర్శనం ఇస్తున్నాయి. సీఎం కేసీఆర్ చెబుతున్నట్టుగా ధనిక రాష్ట్రంలో రాబడి పెరిగి తాగుతున్నారో లేక ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తమ బాధలు తీరండం లేదన్న రందితో తాగుతున్నారో తెలియదుగానీ.. పొద్దుమాపు పోత మాత్రం ఆగడం లేదంటే.. అతిశయోక్తి కాదు.
ఎందుకంటే.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఆబ్కారీ శాఖకు ఆదాయం రాలేదని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి.ఇప్పుడు తెలంగాణ ఆబ్కారీ శాఖ ఆదాయం అమాంతంగా పెరిగిపోయింది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆదాయం గణనీయంగా పెరిగింది. అయితే.. రాష్ట్రం ఆవిర్భవించిన ఈ నాలుగేళ్లలో సరికొత్త రికార్డు దిశగా అడుగులు వేస్తోంది ఆబ్కారీ ఖజానా. కేవలం గత 6నెలల్లో.. 13 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అది ఈ ఏడాది చివరి నాటికి రూ.27-30 వేల కోట్లకు చేరుకుంటుందని ఆ శాఖ అంచనా వేస్తోంది.
బీర్ల రేట్లు పెంచడంతో సర్కార్కు ఆదాయం వస్తోంది. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఆబ్కారీ ఆదాయం రాబడి భారీగా పెరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో రెండేళ్లకు కూడా రాని ఆదాయం మొదటి ఆరునెలల్లో కనిపిండం గమనార్హం. గడచిన నాలుగేళ్ళలో వచ్చిన ఆదాయం ఒక ఎత్తు అయితే, ఈ ఏడాది ఆరునెలల్లోపు వచ్చిన ఆదాయం మరో ఎత్తని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. ఈమధ్య పెంచిన బీర్ల ధరలతో అదనంగా మరో రూ.460 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరడం గమనార్హం.