రాజకీయాల్లో ధీమా అవసరం! అంతకన్నా ముఖ్యంగా తమపై తమకు నమ్మకం కూడా చాలా చాలా అవసరం!! ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పుడు ఇలాంటి ధీమానే వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వాస్తవానికి చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. ఆది నుంచి కూడా వామపక్షాలతోనో బీజేపీతోనో అంటకాగుతూ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. 2009లో అయితే, మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లారు. అదేవిధంగా 2014లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకుని, అప్పుడే ఆవిర్భవించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. విజయం సాధించారు.
అయితే, రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరూ కూడా శ్వాశ్వత మిత్రులు ఉండరు. అలాగని శాశ్వత శత్రువులు కూడా ఉండరు. దీంతో చంద్రబాబుకు గత ఎన్నికల్లో మిత్రులుగా ఉన్న బీజేపీ, పవన్లు ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. దీంతో ఆయన ఒంటరి పోరుకు సిద్ధపడక తప్పడం లేదు. పోనీ ఎవరితోనైనా పొత్తుకు సిద్ధమవుదామన్నా.. ఏపీలో ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఎన్నికలకు ముంద ఏ పార్టీ కూడా చంద్రబాబుకు మద్దతిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆయన ఎట్టిపరిస్థితిలోనూ ఒంటరిగానే బరిలోకి దిగే ఆలోచన చేస్తున్నారు. దీనినినే ఇటీవల వైసీపీఅధినేత జగన్తప్పు పట్టారు. గతంలో ఎప్పుడూ చంద్రబాబు ఒంటరి పోరు చేయలేదు.
2014లోనూ ఆయన రెండు పార్టీలతో జట్టుకట్టి ఎన్నికలకు వెళ్తేనే కనీస మార్కు ఎమ్మెల్యేలను సాధించారు అని అన్నారు. అంతేకాదు, ఇప్పుడు ఆ రెండు పార్టీలూ చంద్రబాబుకు వ్యతిరేకంగా మారిపోయాయి కాబట్టి.. మనం విజృంభిస్తే.. మనకు మెజార్టీ మార్కు రావడం ఖాయమని జగన్ చెప్పారు. గతంలో మనం ఒంటరిగానే పోరాటం చేసి ఎవరి మద్దతు లేకుండానే 67 స్థానాల్లో విజయం సాధించాం. సో.. ఇప్పుడు ఒంటరైన బాబును ఎదర్కొనడం పెద్ద కష్టం కాబోదు అని తీర్మానించినట్టు వార్తలు వచ్చాయి. ఇక, వీటిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారట!
బీజేపీ, పవన్ మద్దతు ఇవ్వకముందే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. వాళ్ల మద్దతు లేకుండానే నంద్యాల ఉప ఎన్నికల్లో 16 శాతం మెజారిటీతో టీడీపీ గెలిచిందన్నారు. జగన్ చెప్తున్న పాత లెక్కలకు ఇప్పుడంత ప్రాధాన్యం లేదని కూడా చంద్రబాబు తీర్మానించినట్టు సమాచారం. సో.. మొత్తానికి ఏపీలో ఆ రెండు విజయాలతో తాను ఒంటరి పోరుకు రెడీ అయినా ప్రజలు గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారట చంద్రబాబు. మరి ఇది నిజం అవుతుందా? లేక జగన్ వ్యాఖ్యలే నిజమవుతాయా? అన్నది చూడాలి.