తండ్రీ, కొడుకులు చంద్రబాబునాయుడు, లోకేష్ చాలా సార్లు తెలిసో తెలీకో నోటికేదొస్తే అది చెప్పేస్తుంటారు. చాలా సందర్భాల్లో వారు చెప్పేది నవ్వుల పాలైన సంఘటనలే ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మంత్రి నారా లోకేష్ అటువంటిదే ఒక విషయం చెప్పారు. విచిత్రమేమిటంటే లోకేష్ చెబుతున్నది పూర్తిగా అబద్దమే అని తేలిపోతున్నా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు.
పెద్ద నోట్లు రద్దు చేయాలట
ఇంతకీ లోకేష్ చెప్పిందేమిటంటే, కేంద్రప్రభుత్వం తక్షణమే రూ. 2 వేల నోట్లను రద్దు చేయాలన్నారు. పెద్ద నోట్ల రద్దుతోనే దేశాభివృద్ధి సాధ్యమంటున్నారు. తక్షణమే రూ. 2 వేల నోట్లను రద్దు చేయటంతో పాటు త్వరలో రూ. 500 నోట్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. సరే, ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆయన చెప్పిందే మరీ విడ్డూరంగా ఉంది.
చంద్రబాబు పోరాటం చేస్తున్నారట
2012 నుండి పెద్ద నోట్ల రద్దుకు చంద్రబాబు పోరాటం చేస్తున్నారట. పెద్ద నోట్ల రద్దుకు చంద్రబాబు చేసిన పోరాటమేంటో ఎవరికీ తెలియటం లేదు. వెయ్యి, 500 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేయకముందు పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాసినట్లు స్వయంగా చంద్రబాబు ఒకసారి చెప్పారు. ఆ తర్వాత కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత తలెత్తిన పరిణామాలను గమనించి పెద్ద నోట్ల రద్దుతో తనకే సంబంధం లేదని ఇదే చంద్రబాబు మీడియాతో చెప్పిన విషయం లోకేష్ మరచిపోయారేమో ?
నగదు బదిలీ పథకం
అదే సమయంలో గతంలో తాను నగదు బదిలీ పథకమంటే అందరూ నవ్వారని కానీ ఇపుడు అదే దేశానికి మార్గదర్శకం కాబోతోందంటున్నారు. అప్పటికేదో తాను పెద్ద దార్శికుడిని అన్న బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. అప్పట్లో టిడిపి నగదుబదిలీ పథకం అన్నది నిజమే. కానీ చెప్పింది 2009 ఎన్నికల మ్యానిఫెస్టో సమయంలో. అప్పట్లో జనాలు టిడిపిని ఓడగొగట్టారు. దాంతో నగదు బదిలీ పథకం గురించి చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించని విషయం గమనించాలి.