ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో సామాజికవర్గాల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ జనసేనలో చెప్పుకోదగ్గ నేతలెవరూ చేరలేదన్నది వాస్తవం. ఉన్న కొద్దిమంది నేతల్లో కూడా మెజారిటీ కాపు సామాజికవర్గం వారే. అందులోనూ జనాలతో ఏమాత్రం సంబంధం లేని వారే ఎక్కువ అన్నది వాస్తవం.
బిసిల అండ లేకుండా గెలవగలరా ?
ఈ పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో పవన్ కు అర్ధం కావటం లేదు. కాపు సామాజికవర్గం నేతలను మాత్రం పక్కనపెట్టుకుంటే ఎన్నికల్లో గట్టెక్కటం సాధ్యం కాదన్న విషయం పవన్ కు తెలీకుండాన ఉంటుందా ? అందుకనే బిసి సామాజికవర్గం నేతలకు గాలమేస్తున్నారు. బిసిల్లోని బలమైన ఉపకులం శెట్టిజలిజలకు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామంటూ తాజాగా చేసిన ప్రకటన అందులో భాగమే.
బిసి నేతలతో సమావేశం
అందుకనే బిసి సామాజికవర్గానికి చెందిన ముమ్మడివరం వైసిపి మాజీ సమన్వయకర్త పితాని బాలకృష్ణ తదితరులతో తాజాగా భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో శెట్టిబలిజలకు ప్రధాన్యం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు-బిసి సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే. కాపులు ఒక పార్టీకి మద్దతిస్తే బిసిలు ఇంకో పార్టీకి మద్దతుగా నిలబడతారు. కాపు-బిసి సామాజికవర్గాలకు చెందిన నేతలు ఒకరిని మరొకరు ఓడగొట్టానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో కూడా అందుకు మినహాయింపు ఉండదనే అనుకోవాలి.
శెట్టిబలిజలు, యాదవులకే ప్రాధానత
బిసిల్లో సుమారు 140 ఉపకులాలున్నాయి. అన్నింటిలోకి డామినేషన్ మాత్రం శెట్టిబలిజలు, యాదవులదనే చెప్పాలి. పై రెండు ఉపకులాల నేతలను పక్కనపెట్టి ఏ పార్టీ కూడా ఏమీ చేయలేందు. ఆ విషయం పవన్ కు బాగా అర్ధమైనట్లుంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో శెట్టి బలిజలకు ప్రాధాన్యమంటూ దువ్వుడు కార్యక్రమం మొదలుపెట్టారు. శెట్టిబలిజలతో పాటు వెనుకబడిన అన్నీ కులాలకు అండగా ఉంటానంటూ పవన్ హామీ ఇవ్వటం గమనార్హం.