ఇప్పటి వరకు టీఆర్ఎస్ లో కనిపించిన ముందస్తు ఎన్నికల హడావుడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న గ్రూపు విబేధాలు పక్కనబెట్టి తెలంగాణాలో పార్టీ జెండా రెపరెపలాడించేందుకు కాంగ్రెస్ సీనియర్లు కూడా సిద్ధం అవుతున్నారు. మరో పక్క కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ నేతలకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తూ అందరిని ఒకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యారు. గతంలో కంటే ఇప్పుడు పార్టీ పరిస్థితి మెరుగైనట్టుగానే కనిపిస్తోంది.
తాజాగా ... కాంగ్రెస్ కార్యకర్తలతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన ఫేస్ బుక్ లైవ్ లో డిసెంబర్ - జనవరి నెలలలో ఎన్నికలు ఉంటాయని చెప్పారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల పనులలో తలమునకలవుతున్నారు. మేనిఫెస్టో తయారి ఒకవైపు చేస్తూనే .. టీఆర్ఎస్ తప్పులను ఎండగట్టడం వంటి కార్యక్రమాలపై ద్రుష్టి సారిస్తున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక హామీలు ఇస్తూ తమ పార్టీ అధికారంలోకి వస్తే కష్టాలే ఉండవని చెబుతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలని వ్యూహాలు పన్నుతున్నారు.
ఇక ప్రజలను ఆకట్టుకునేందుకు హామీలు కూడా అధికార పార్టీకి ధీటుగా ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వృధాప్య పింఛన్లు మరింత పెంచుతామంటున్నారు. భార్యభర్తలిద్దరికీ పింఛన్లు ఇస్తామని ప్రభుత్వ ఉద్యోగుల తల్లితండ్రులకూ దీనిని వర్తింప చేస్తామని హామీలు ఇస్తున్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుందని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. అంతేకాదు 5000 కోట్లతో రైతులకు అవసరమైన అన్నీ కార్యక్రమాలను చేపడతామని ప్రకటిస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాలను గతంలో విడుదల చేసినట్లుగా కాకుండా కొత్త తరహాలో విడుదల చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ కొత్త ఆలోచన. ఇందుకోసం ఓ యాప్ ను కూడా రూపొందించనున్నారు. శక్తియాన్ పేరుతో రూపొందుతున్న ఈ యాప్ ద్వారా కార్యకర్తల నుంచి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తారు. ఎక్కువ మంది కార్యకర్తలు ఎవరికి ఓటు వేస్తారో...అంటే ఎవరైతే తమకు మంచి అభ్యర్ధి అని చెబుతారో వారికి టిక్కెట్ కేటాయించేలా ప్లాన్ చేశారు. ఇలా అనేక హామీలు , సంస్కరణలతో కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుండగా వారికి ధీటుగా మరిన్ని హామీలు ఇచ్చేందుకు అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.