వచ్చే ఎన్నికల్లో వైసిపి పొటీ చేసే విషయంలో వైసిపి నేతల్లోనే అయోమయం కనిపిస్తోంది. పొత్తుల విషయంలో ఆ పార్టీ నేత సుధాకర్ బాబు చేసిన ప్రకటనే వారిలోని అయోమయానికి నిదర్శనంగా నిలుస్తోంది. వైసిపి ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందా ? లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తుందా ? అన్నది ఆ పార్టీ ఇష్టం. ఇప్పటి వరకూ ఇతర పార్టీలతో పొత్తులుంటుందని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఎప్పుడూ చెప్పలేదు. ఎవరితోనో పొత్తు పెట్టుకుని వైసిపి పోటీ చేస్తుందని కూడా జనాలు అనుకోవటం లేదు.
పొత్తుపై చెప్పింది మాజీ ఎంపినే
అయితే, పొత్తుల విషయం జనాలను లేకపోతే వైసిపి నేతలను అయోమయంలో పడేస్తోంది స్వయానా వైసిపిలోని కీలక వ్యక్తులే కావటం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో వైసిపి, జనసేనలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయని ప్రచారం చేస్తోంది ఎవరు ? పొత్తుల ప్రకటన చేస్తోంది స్వయానా తిరుపతి మాజీ ఎంపి వరప్రసాదే. జనసేనతో వైసిపి పొత్తుంటుందని , రెండు పార్టీలు కలిసే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటాయంటూ మాజీ ఎంపి పదే పదే ఎందుకు ప్రకటిస్తున్నారు ? ఏదో సమావేశంలో నేతలతో మాట్లాడిన విషయాలు బయటకు పొక్కటమో లేకపోతే ఇంకెక్కడైనా ఆఫ్ ది రికార్డుగా చెప్పటమో కాదు. స్వయంగా మీడియా సమావేశంలోనే ప్రకటిస్తున్నారు.
కట్టడి చేయాల్సిన బాధ్యత నాయకత్వానిదే
ఎప్పుడైతే మీజీ ఎంపి పొత్తుల విషయాన్ని ప్రకటిస్తున్నారో అదే విషయం మీడియా లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇటువంటి ప్రకటనలతోనే వైసిపి నేతల్లో ఎంతటి అయోమయం నెలకొందో అర్ధమైపోతోంది. వరప్రసాద్ద పొత్తుల గురించి మాట్లాడటం, వెంటనే అటువంటిదేమీ లేదని ఇంకెవరో నేత ప్రకటించటమేంటి ? ఇక్కడ ఎవరు ఎవరిని అయోమయంలో పడేస్తున్నారో వైసిపి నేతలు గ్రహించాలి. పొత్తుల విషయంలో మాట్లాడవద్దని వరప్రసాద్ లాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత వైసిపి నాయకత్వంపైనే ఉందని గ్రహించాలి.