చంద్రబాబునాయుడు ఇక మారే అవకాశమే లేదు. ఒకసారి చేసిన మోసాన్నే మళ్ళీ రిపీట్ చేసి జనాలను మరోసారి మభ్య పెడదామని అనుకుంటున్నారు. అంటే ఇదేమీ కొత్త మోసం కాదనుకోండి. పోయిన ఎన్నికల్లో ఇచ్చిన మోసపు హామీకి ఇపుడిస్తున్నది జస్ట్ ఎక్స్ టెన్షన్ మాత్రమే. పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీతోనే సామాజికవర్గాల మధ్య రిజర్వేషన్ చిచ్చుపెట్టారు. మళ్ళీ అదే చిచ్చును వచ్చే ఎన్నికల్లో కూడా పెట్టాలని చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు.
మూడు ఉప కులాలను ఎస్సీ ఎస్టీల్లో చేరుస్తారట
ఇంతకీ విషయం ఏమిటంటే వడ్డెర రజక బెస్త కులాలను ఎస్టీ ఎస్సీ క్యాటగిరీలో చేర్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయమంటూ ఆంధ్రా యూనివర్సిటీ అధికారులను పురమాయించటమే. ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ వేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలట. అది కూడా రాష్ట్రమంతటా తిరిగి పై కులాల్లోని జనాల ఆర్ధిక సామాజిక స్ధితిగతులపై అధ్యయనం చేయాలని స్పష్టంగా చెప్పారు. అంటే చెప్పింది నేరుగా చంద్రబాబు కాదులేండి మంత్రి అచ్చెన్నాయడు.
సిఎం అనుమతి లేకుండా అచ్చెన్న ఆదేశాలా ?
ఆదేశాలు ఇచ్చింది మంత్రి అచ్చెన్నాయుడు కావచ్చు మరొకరు కావచ్చు. మొత్తం మీద చంద్రబాబు అనుమతి లేకుండా ఏ మంత్రి కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు కదా కాబట్టి చంద్రబాబు అనుమతితోనే మంత్రి ఆదేశాలు ఇచ్చి ఉంటారనటంలో సందేహమే లేదు. పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తానని బోయలను ఎస్టీల్లో చేరుస్తానంటూ ఇచ్చిన హామీ ఎంత బాగా అమలవుతోందో అందరూ చూస్తున్నదే. తానిచ్చిన హామీ అమలు కాదన్న విషయం బాగా తెలిసినా సిఎం పదవిని అందుకోవటమే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు తప్పుడు హామీ ఇచ్చారు.
మోసానికి రంగం సిద్ధం
చంద్రబాబు హామీని నమ్మటం వల్లే కాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు కూడా ఉండటంతో కాపులు పోయిన ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు పలికారు. కానీ చివరకు జరిగిందేమిటో అందరికీ తెలిసిందే. నాలుగేళ్ళు బిజెపితో అంటకాగినంత కాలం కాపులకు రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే బిజెపితో కటీఫ్ చెప్పారో వెంటనే కాపులను బిసిల్లో చేర్చాలనే అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపేసి చేతులు దులిపేసుకున్నారు. అంటే కాపులకు తాను బిసి రిజర్వేషన్ కల్పించాలని అనుకున్నా కేంద్రం అంగీకరించలేదని చెప్పటమే చంద్రబాబు ఉద్దేశ్యం.
ఓట్లు కొల్లగొట్టడమే ఉద్దేశ్యం
రేపటి ఎన్నికల్లో కూడా చంద్రబాబు మళ్ళీ జనాలను మోసం చేయటానికి రెడీ అవుతున్నారు. లేకపోతే కాపులను బిసిల్లో బోయలను ఎస్టీల్లో చేర్చలేని వ్యక్తి వడ్డెరలు బెస్తలు రజకులను ఎస్టీ ఎస్సీల్లో ఎలా కలపగలరు ఒకవేళ వాళ్ళని పై కులాల్లో కలపాలని చంద్రబాబు నిర్ణయించినా మళ్ళీ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాల్సిందే కదా మొన్న కాపులను బిసిల్లో చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం తిప్పి కొట్టింది. మళ్ళీ పై సామాజికవర్గాలకు చెందిన ప్రతిపాదనలను కూడా కేంద్రం తిప్పి పంపదని గ్యారెంటీ ఏంటి కేంద్రం తిప్పి పంపుతుందని చంద్రబాబుకు బాగా తెలుసు. కాకపోతే పై సామాజికవర్గాల ఓట్లను కొల్లగొట్టటం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందాలన్న వ్యూహం తప్ప ఇంకేమీ కాదు.