చంద్రబాబునాయుడు అవినీతిపై బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ను ఈరోజు విజయవాడలో గవర్నర్ ను నేతలు జివిఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, విష్ణువర్ధన్ రెడ్డి కలిసి వెంటనే దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందంటూ గవర్నర్ కు ఇచ్చిన లేఖలో ఆరోపించారు.
మూడు అంశాలపై ఫిర్యాదు
బిజెపి నేతలు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టారు. భోగాపురం విమానాశ్రయం టెండర్లు రద్దు, అమరావతి బాండ్ల జారీ, పిడి ఖాతాల్లో వేలాది కోట్ల రూపాయలుంచటంపై వీరు తీవ్ర ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయలు భోగాపురం విమానాశ్రయం టెండర్లలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందంటూ ఈ మధ్యనే సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. టెండర్లు ఏర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) దక్కించుకుందన్న ఏకైక కారణంతోనే టెండర్లు రద్దు చేసి మరీ టెండర్లు పిలుస్తునట్లు చంద్రబాబు పై ఫిర్యాదు చేశారు.
తక్షణమే విచారణకు డిమాండ్
ఇక, వేలాది పిడి ఖాతాల్లో వేలాది కోట్ల రూపాయలుంచటం, మెల్లిగా అందులో నుండి వందల కోట్లు దారి మళ్ళటంపై రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు గవర్నర్ కు వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వేలాది ఖాతాల్లో వేలాది కోట్ల రూపాయలుంచటం, దారి మళ్ళించటం చాలా పెద్ద కుంభకోణంగా ఆరోపించారు. ఇక, ఈమధ్యే జారీ చేసిన అమరావతి బాండ్ల విషయంలో కూడా బిజెపి నేతలు ఆరోపించారు. బాండ్లు జారీ చేసిన గంటలోనే ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అవ్వటంపై రాష్ట్రప్రభుత్వం గొప్పగా చెప్పుకోవటంలో కూడా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అత్యధిక వడ్డీ చెల్లించి బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించటం వెనుక పెద్ద కుంభకోణం దాగుందంటూ బిజెపి నేతలు మండిపడ్డారు. కాబట్టి తమ ఆరోపణలపై గవర్నర్ కలగజేసుకుని విచారణ జరిపించాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.