సోనియా గాంధి ముద్దుల తనయుడు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జర్మనీలో చేసిన ప్రసంగంపై అధికార భారతీయ జనతా పార్టీ అగ్గిమీద గుగ్గిలమే అయింది. జాతి అభివృద్ది ప్రధన స్రవంతి ప్రక్రియ నుంచి గిరిజనులు, దళితులు, మైనారిటీలు వంటి వారిని దూరంగా ఉంచినా వెలివేసినా ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకొస్తాయని ఆయన అక్కడ హెచ్చరించారు.
జర్మనీ, హాంబర్గ్ లోని బ్యూసెరియన్ సమ్మర్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆవేశంగా మాట్లాడిన రాహుల్ గాంధి ప్రజలను వెలివేయడం 21వ శతాబ్దంలో చాలా ప్రమాద కరమని, ఈ శతాబ్దంలో ప్రజలకు సరైన దిశానిర్దేశనం చేయకపోతే ఆ పనిని మరెవరైనా చేయగలరని అన్నారు. దేశ అభివృద్ది ప్రక్రియ నుంచి అత్యధిక సంఖ్యాకులను సుదూరంగా ఉంచటం వలన లేదా బహిష్కరించడంవల్ల కలిగే నిజమైన నష్టం అదే అని వ్యాఖ్యానించారు.70 ఏళ్ళ క్రితం మనకు స్వాతంత్రం వచ్చిందని, గ్రామీణ భారతం నుంచి ఆధునిక భారతానికి మార్పు చెందే ప్రక్రియను ఎంచుకొని ఆ మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభించామని చెప్పారు.
అధికారం అభివృద్ధి ఒక వ్యక్తి చుట్టూ కేంద్రీకృతం కారాదన్నది ముఖ్యవిషయమని — ప్రక్రియలో ప్రతి ఒక్కరినీ కలుపుకుపోవాలన్నది అప్పట్లో మౌలిక సిద్ధాంత మని చెప్పారు. ఈ జాగృతిలో ప్రతి భారతీయుడిని కలుపుకుపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ పరివర్తన వల్ల పేదలు, నిమ్న కులాలవారికి అత్యధిక నష్టం జరుగు తుందని, వారికి సహాయం అవసరమని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వానికి ముందు వచ్చిన ప్రభుత్వాలన్నీ దీనిని అనుసరించాయని అన్నారు.
ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు సామూహికంగా ఉన్మాదంతో హత్య చేస్తున్న సంఘటనలు, నిరుద్యోగం వల్ల ఉత్పన్నమైన ఆగ్రహం ఫలితమే ఇటువంటి హత్యలని అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారాలు దెబ్బతినడం, జీఎస్టీ సక్రమంగా అమలు కాకపోవడం కూడా దీనికి కారణమేనని చెప్పారు.
దేశానికే ప్రతిపక్ష అధినేత రాహుల్ గాంధి బాధ్యత మరచి చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. విదేశంలో జన్మభూమి భారత్ ను అవమా నించేలా మాట్లాడ డం, "టెర్రరిజాన్ని సమర్థిస్తున్నట్టు వ్యాఖ్యలు " చేయడం ఏ విధంగానూ క్షంతవ్యం కాదని, ఆయన భారత జాతికే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి డిమాండ్ చేశారు.
అల్ ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల సిద్ధాంతాలను తిరస్కరించిన దేశం భారత్ అని, ఇలాంటి శక్తులను ప్రేరేపించేట్టుగా రెచ్చగొట్టేలాగా రాహుల్ మాట్లాడడం తగ దని అన్నారు. బీజేపీ ప్రతినిధి సాంబిత్ పాత్రా, రాహుల్ గాంధి ఉపన్యాసం పట్ల మండిపడుతూ, "సిరియాలో ఐసిస్ ఏర్పాటును ఆయన సమర్థిస్తున్నారా?" అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఇండియాకు ఒక విజన్ అంటూ ఇవ్వకపోతే ఈ టెర్రరిస్టు సంస్థలు ఆ పనిచేసే ముప్పు ఉందన్నట్టు పేర్కొనడం ఏ మాత్రం క్షంతవ్యం కాదని అన్నారు.