ఆవు చేలో మేస్తే డూడ గట్టున మేస్తుందా ? అనే సామెత తెలుగులో చాలా పాపులర్. ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యవహారం ఇలాగే ఉంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు వేల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నపుడు తాను లక్షల రూపాయలు వృధా చేస్తే తప్పేంటని అనుకున్నారో ఏమో ? లేకపోతే జనాలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న సొమ్ము ఇష్టానుసారంగా ఎంత ఖర్చు పెట్టినా అడిగే వారుండరన్న ధైర్యమో తెలీటం లేదు.
రూట్ కెనాల్ వైద్యం
ఇంతకీ విషయం ఏమిటంటే, ఆర్ధిక శాఖ మంత్రి యనమల పళ్ళ (దంతాలు) కు రూట్ కెనాల్ చికిత్స అవసరమొచ్చింది. ఆ చికిత్స చేసే నిపుణులు ఏపిలో లేకపోతే హైదరాబాద్ లో కొన్ని వందలమందున్నారు. దంత వైద్యంలో రూట్ కెనాల్ అన్నది చాలా సాధారణ ప్రక్రియే. కొద్దిపాటి అనుభవం ఉన్న ఏ డాక్టర్ అయినా చేయగలరు. మూడు సిట్టింగుల్లో రూట్ కెనాల్ ట్రీట్ మెంటు పూర్తయిపోతుంది. ఎంత ఖరీదైన డాక్టర్ దగ్గరైనా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ రూ 15 వేలల్లో పూర్తయిపోతోంది.
జనాల డబ్బేకదా ?
అటువంటిది యనమల రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ కోసం ఇక్కెక్కడా కాదని ఏకంగా సింగపూర్ కు వెళ్ళారు. మరి అక్కడ ఏ వైద్యుడు ట్రీట్ మెంట్ ఇచ్చారో అసలు యనమల చేయించుకున్న వైద్యం ఏంటో ఎవరికీ తెలీదు. సింగపూర్లో చేయించుకున్న రూట్ కెనాల్ వైద్య ఖర్చకు ప్రభుత్వం రూ. 2.88 లక్షలు మంజూరు చేసింది. 15 వేల రూపాయలెక్కడ, 2.88 లక్షల రూపాయలెక్కడ ? అదే సొంత డబ్బు పెట్టుకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్దితే వస్తే యనమల సింగపూర్ వెళ్ళేవారేనా ? అది కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి గురించి బాగా తెలిసిన యనమలే ఇలా చేస్తే మిగిలిన వాళ్ళ సంగతి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. యనమల లాంటి వాళ్ళని చూసేనేమో పై సామెత పుట్టుకొచ్చింది.